జన'సేన' కోసం రంగంలోకి వైసిపి: పవన్ కళ్యాణ్ ఎమోషన్ మిస్సయిందా? అక్కడే చిక్కు
నంద్యాల ఉప ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆయన నిర్ణయంపై నంద్యాలలోని జనసైనికులు, అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారని తెలుస్తోంది.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆయన నిర్ణయంపై నంద్యాలలోని జనసైనికులు, అభిమానులు ఆశ్చర్యానికి లోనయ్యారని తెలుస్తోంది.
డైలమాలో జనసైనికులు
పవన్ కళ్యాణ్ ప్రకటన కోసం ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు నిరీక్షించారు. దాదాపు టిడిపికి మద్దతు పలుకుతారని చాలామంది ఫిక్స్ అయ్యారు. కానీ జనసేనాని మాత్రం ఊహించని షాకిచ్చారు. దీంతో జనసైనికులు డైలామాలో పడ్డారు.
Recommended Video
మళ్లీ రంగంలోకి వైసిపి
నంద్యాలలో వేలాది మంది పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఉన్నారు. పవన్ ప్రకటనకు ముందు నుంచే వైసిపి నేతలు వారిని తమ వైపుకు లాక్కునే ప్రయత్నాలు చేశారు. కానీ పవన్ సూచించిన వారికే మద్దతిస్తామని వైసిపి నేతలకు తొలుత తేల్చి చెప్పారు. ఇప్పుడు పవన్ తటస్థమని ప్రకటించడంతో వైసిపి మళ్లీ రంగంలోకి దిగిందని తెలుస్తోంది.
ఆ ఎమోషన్ మిస్సయిందంటున్నారు
ఇదిలా ఉండగా, ప్రజా సమస్యలపై స్పందించేటప్పుడు పవన్ కళ్యాణ్లో కనిపించే ఎమోషన్ అందరికీ నచ్చుతుంది. ఆ ఎమోషన్లో నిజాయితీ కనిపిస్తుంది. కుల, మత, ప్రాంత, రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు అతీతంగా పవన్ అదే ఎమోషన్తో తన అభిప్రాయాలు చెబుతుంటారు. కానీ ఈ ఎమోషన్ నంద్యాల ఉప ఎన్నిక విషయంలో మాత్రం మిస్పయిందని కొందరు అంటున్నారు.
అందరూ అవాక్కయ్యారు
పవన్ కళ్యాణ్ నోటి వెంట వచ్చిన తటస్థ ప్రకటన చూసి అభిమానులతో పాటు టిడిపి నేతలు, కార్యకర్తలూ అవాక్కయ్యారు. అందరూ ఆయన ఎవరికి మద్దతిస్తారా అని చర్చించారు. చాలామంది ఊహించినట్లుగానే ఆయన తప్పించుకు తిరిగారని చెప్పవచ్చు.
భూమా కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ
వాస్తవానికి భూమా ఫ్యామిలీతో పవన్కు సుదీర్ఘమైన అనుబంధమే ఉంది. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రాయలసీమ నుంచి పార్టీలో చేరిన కీలక నేత భూమానే. ఆ తర్వాత కూడా పార్టీలో భూమా దంపతులు కీలకపాత్ర పోషించారు. భూమా కుటుంబంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఆ విధంగా చూసినా భూమా కుటుంబానికి అండగా ఉంటారని కొందరు భావించారు. కానీ రాజకీయాల్లో తనదైన దారి కోసం అన్నయ్య చిరంజీవికే దూరం జరిగారని, అలాంటిది భూమా కుటుంబానికి మద్దతు ఇవ్వరని కూడా ఎక్కువ మంది భావించారు.
అక్కడే పవన్ కళ్యాణ్కు చిక్కు
2014 ఎన్నికల్లో భూమా వైసిపి నుంచి గెలిచి, ఆ తర్వాత టిడిపిలో చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఫిరాయించిన భూమా కుటుంబానికి మద్దతు ఇస్తే తన నైతికత దెబ్బతింటుందని పవన్ కళ్యాణ్ భావించి ఉంటారని అంటున్నారు. అందుకే టిడిపికి మద్దతివ్వలేక, తటస్థంగా ఉన్నారని భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే (భూమా నాగిరెడ్డి) చనిపోయినప్పటికీ.. పార్టీ మారడమే భూమా కుటుంబానికి మద్దతు ఇవ్వలేని పరిస్థితిని పవన్కు తెచ్చిందని అంటున్నారు. కాబట్టి ఇక్కడ పవన్ ఎమోషన్స్ మిస్సయ్యారనే వాదనకు అర్థం లేదంటున్నారు.