'పవన్ ఎందుకు సైలెంట్ అయ్యారు.. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంటే స్పందించరా?'
ప్రశ్నించడానికే పుట్టిందని చెప్పుకునే పార్టీ.. రాజ్యాంగ నిబంధనలను ఉల్లఘించినా ఎందుకు స్పందించడం లేదని దుర్గేష్ మండిపడ్డారు.
రాజమండ్రి: గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్దతునిచ్చినందుకు గాను ప్రభుత్వం తీసుకునే ప్రతీ చర్యకు పవన్ కళ్యాణ్ కూడా బాధ్యత వహించాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో మళ్లీ పవన్ పై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షం వైసీపీ దీనిపై స్పందించాల్సిందిగా జనసేన అధ్యక్షుడిని డిమాండ్ చేస్తోంది.
వైసీపీ నేత కందుల దుర్గేష్ తాజాగా ఇదే విషయమై పవన్ కళ్యాణ్ ను నిలదీశారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చేలా టీడీపీ వ్యవహరిస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించినా పవన్ నోరు మెదపరా? అని ప్రశ్నించారు.
ప్రశ్నించడానికే పుట్టిందని చెప్పుకునే పార్టీ.. రాజ్యాంగ నిబంధనలను ఉల్లఘించినా ఎందుకు స్పందించడం లేదని దుర్గేష్ మండిపడ్డారు. మంగళవారం నాడు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ దుర్గేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోవడం దారుణమని అన్నారు.
కాగా, వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు మంత్రిపదవులు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఫిరాయింపు చట్టాలను మరింత కఠినతరం చేయాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. బీజేపీ నేత పురంధేశ్వరి సైతం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ హైకమాండ్ కు లేఖ రాశారు.