రఘురామ వచ్చారు - ఆయన ఎందుకు ఆగిపోయారు : చంద్రబాబు వద్దన్నారా- తిరుపతి సభలో ఏం జరిగింది..!!
అమరావతి మహోద్యమ సభ పేరుతో తిరుపతిలో భారీగా నిర్వహించారు. వైసీపీ - సీపీఎం మినహా అన్ని పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకురావటంలో నిర్వాహకులు సక్సెస్ అయ్యారు. పరోక్షంగా చంద్రబాబు కనుసన్నల్లోనే ఈ సభ జరిగిందనేది పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. ఇక, ఈ వేదిక మీద తమ రాజకీయ విభేదాలను పక్కన పెట్టి.. బీజేపీ - కాంగ్రెస్- వామపక్షాలు అమరావతి రైతుల కోసం కదిలి వచ్చాయి. అందరూ అమరావతి రాజధానిగా కొనసాగాలని డిమాండ్ చేసారు.
తిరుపతి సభ ద్వారా సీఎంపై ఒత్తిడి
ఇలా అన్ని పార్టీలను అమరావతికి మద్దతుగా తీసుకురావటం ద్వారా సీఎం జగన్ పైన ఒత్తిడి పెంచాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ వ్యూహం. అందులో సక్సెస్ అయ్యారు. ఇదే వేదిక మీద నుంచి సీపీఐ నేతలు కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రధాని..కేంద్ర హోం మంత్రి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ సీఎం జగన్ కు చెబితే ముఖ్యమంత్రి కాదనలేని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ఇక, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ తొలి నుంచి అమరావతికి మద్దతుగానే తన వాయిస్ వినిపిస్తున్నారు. ఆయన ఈ సభకు రావటం పైన తొలి నుంచి కొంత సస్పెన్స్ కంటిన్యూ అయింది.
రఘురామ రావటం వెనుక వ్యూహం
తిరుపతి రాకపోయినా...వర్చ్యువల్ గా సభలో పాల్గొనాలని రఘురామ భావించారు. కానీ, నేరుగా సభకు హాజరయ్యారు. చంద్రబాబును ఆలింగనం చేసుకొని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. అయితే, ఈ సభకు మరో ప్రముఖ వ్యక్తి వస్తారని చివరి వరకు ప్రచారం సాగినా..ఆయన హాజరు కాలేదు. ఢిల్లీలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటంలో కీలకంగా వ్యవహరించిన రాకేశ్ తికాయత్ను అమరావతి జేఏసీ ఆహ్వనించాలని నిర్ణయించింది.
ఆయన సభకు వస్తారని జేఏసీ నేతలు చెబుతూ వచ్చారు. అమరావతి జేఏసీ నేతలు గతంలో ఆయన వద్దకు వెళ్లి.. తమ ఉద్యమానికి మద్దతివ్వాలని కోరారు. తికాయత్ సైతం అమరావతి వచ్చి రైతుల పోరాటానికి మద్దతు ప్రకటించారు.
రాకేశ్ తికాయత్ ను ఆహ్వానించాలనుకున్నా
అయితే, కేంద్రం తాము తీసుకొచ్చిన రైతు చట్టాలను ఉపసంహరించుకుంది. అయితే, బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం తికాయత్ వ్యవహరించిన తీరు పైన ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన తికాయత్ కేంద్రంలోని బీజేపీ..తెలంగాణలోకి టీఆర్ఎస్ ప్రభుత్వాల పైన తీవ్ర విమర్శలు చేసారు.
దీంతో..కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనలో అమరావతికి మద్దతుగా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయటంతో బీజేపీ నేతలు సైతం పాదయాత్రలో పాల్గొన్నారు. తిరుపతి సభకు వచ్చారు. ఇదే వేదిక మీదకు తికాయత్ ను ఆహ్వానించి..ఆయన వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే మొత్తాన్నికే నష్టం జరిగే అవకాశం ఉందని అంచనా వేసినట్లుగా ప్రచారం సాగుతోంది.
చివరి నిమిషంలో నిర్ణయంలో మార్పు
దీంతో..టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనను ఆహ్వానించే అంశం పైన అమరావతి జేఏసీ నేతలకు సూచన చేసినట్లుగా సమాచారం. ఇక, వైసీపీ నేతలు మాత్రం ఈ సభ నిర్వహణ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు కంటిన్యూ చేస్తున్నారు. తమ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేస్తున్నారు.
తిరుపతి కేంద్రంగా నిర్వహించిన అమరావతి సభ సక్సెస్ కావటంతో ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ పైన అమరావతి జేఏసీ..ఇటు ప్రభుత్వ పరంగా ఏం చేద్దామనే అంశం పైన అధికార పార్టీ ముఖ్యులు సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో..రెండు వైపుల నుంచి తీసుకొనే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొని ఉంది.