పవన్ కల్యాణ్ పర్యటిస్తే సీఎం జగన్ గుండెల్లో దడ, అప్పుడు ముద్దులు పెట్టి, ఇప్పుడు గుద్దులా: చంద్రబాబు
రాజధాని అమరావతి కోసం దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర ప్రాంతాల నుంచి మట్టి, నీరు సేకరించామని చంద్రబాబు గుర్తుచేశారు. దీంతో అమరావతి ప్రాంతం పునీతమైందని, ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన రాజధానిని సీఎం జగన్ ఎలా మారుస్తారని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రకటనలను ప్రజలు గమనిస్తున్నారని, ఆయనకు బుద్ది చెప్పే రోజు తర్వలో వస్తోందని చంద్రబాబు జోస్యం చెప్పారు.

సచివాలయం..
రాజధాని కోసం ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని సీఎం జగన్ కొత్త వాదనను తీసుకొచ్చారు. ఇది సరికాదని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో సచివాలయం లేదా; తాను కట్టించిన సచివాలయం, తమ ప్రభుత్వం తీసుకొచ్చిన కుర్చీలను వాడుతున్నారు కదా అని చంద్రబాబు ప్రశ్నించారు. అంతేకాదు దేశంలో ఏ ప్రభుత్వం కేటాయించిన విధంగా ఉద్యోగులకు కూడా ఏసీలు సమకూర్చింది తమ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. అమరావతిలో అసెంబ్లీ భవన సముదాయం ఉందని.. 187 రోజుల్లో భవన నిర్మాణం పూర్తిచేశామని పేర్కొన్నారు.

పాపం పండే రోజు..
తనను సీఎం జగన్ తిడుతున్నారు.. ఫరవాలేదు కానీ పాపం పండితే అన్నీ బయటకొస్తాయని పేర్కొన్నారు. తనను మాజీ సీఎం, దివంగత వైఎస్ఆర్ కూడా గౌవవించేవారని పేర్కొన్నారు. జగన్ మాత్రం గౌరవించడం లేదని, 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన తననే పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో ప్రతిపక్ష నేతలు పర్యటిస్తే తప్పేంటి అని చంద్రబాబు నిలదీశారు.

పవన్ పర్యటిస్తే దడ..
మంగళవారం మందడంలో పవన్ కల్యాణ్ పర్యటిస్తే తప్పేంటి అని అడిగారు. రైతులతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకుంటే సీఎం జగన్కు వచ్చిన నష్టం ఏంటీ అని చంద్రబాబు ప్రశ్నించారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉండి జగన్ రాష్ట్రవ్యాప్తంగా ఊరూరా తిరగలేదా అని నిలదీశారు. ఊరూరా తిరిగి ముద్దులు పెట్టి, ఇప్పుడు పిడిగుద్దులు గుద్దడం సరికాదన్నారు. మందడంలో పవన్ కల్యాణ్ ఉంటే సీఎం కాన్వాయ్ వెళ్లదా అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి పిరికివాడు అని.. అందుకే తొలుత డమ్మీ కాన్వాయ్ పంపించారని పేర్కొన్నారు. తాను ఇప్పడే కాదు ఎప్పుడు భయపడలేదన్నారు. అలిపిరిలో మావోయిస్టులు దాడి చేసినా భయపడలేదని, ధైర్యంగా ఎదుర్కొన్నానని పేర్కొన్నారు.

కళ్లొచ్చాయా..
ఒక్కసారి ముఖ్యమంత్రి కాగానే జగన్కు కళ్లొచ్చాయా అని ప్రశ్నించారు. తాను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని, ఎన్నడూ ప్రతిపక్షనేతలను ఇబ్బందికి గురిచేయలేదని చెప్పారు. అవసరమనుకుంటే తన కాన్వాయ్ని రెండు నిమిషాల పాటు ఆపమని కోరిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు. కానీ జగన్ మాత్రం తన కాన్వాయ్ వస్తుంటే ప్రజలే కాదు నేతలు కూడా కనిపించొద్దా? ఇదేక్కడి అరాచకం అని చంద్రబాబు విస్తుపోయారు.

రైతులా? గుండాలా
రాజధాని ప్రాంతంలో నిరసన తెలిపిన రైతులపై 307 సెక్షన్ కింద అటెంప్ట్ మర్డర్ కేసులు నమోదు చేశారని గుర్తుచేశారు. వారీ వద్ద తుపాకీలు ఉన్నాయా ? లేదంటే పులివెందుల బాంబులు లభించాయా ? కత్తులు ఉన్నాయా అని చంద్రబాబు అడిగారు. ఈ ప్రభుత్వానికి ఇంత కరేజా ఉంటే వైఎస్ వివేకానందరెడ్డిని చంపినవారిపై పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. కోడి కత్తి కేసు ఏమైందని... ఎందుకు అటకెక్కించారని నిలదీశారు. ఏ పార్టీకి అధికారం శాశ్వతం కాదు.. ఆ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలని సూచించారు. వైసీపీ కోరిక మేరకు ఒక్కసారి ప్రజలు అధికారం కట్టబెట్టారని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications