ఎన్నికల ఏడాదికి జగన్ భారీ స్కెచ్-ఏడాదిలోనే వాతలు పూర్తి-వ్యతిరేకత లేకుండా జనంలోకి !
ఏపీలో వరుసగా పన్నులు, ఛార్జీల మోత మోగుతోంది. ఇప్పటికే చెత్తపన్ను, ఆస్తిపన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీల పెంపు రూపంలో బాదుడు కొనసాగుతోంది. త్వరలో మరిన్ని పన్నుల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది. దీని వెనుక ఏముందనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది. అసలే అప్పులతో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వాన్ని గట్టెక్కించడం కోసమే ఈ పన్నులు పెంచుతున్నారా లేక ఎన్నికల ఏడాదిలో ఇబ్బందులు తప్పించుకోవడానికా అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి.

అప్పులాంధ్రప్రదేశ్
ఏపీలో ప్రభుత్వం కొన్నేళ్లుగా అప్పులతోనే నడుస్తోంది. అప్పులు చేయడానికి కేంద్రం విధించిన పరిమితులు కూడా దాటిపోయి మరీ అప్పులు చేసేస్తున్నారు. బడ్జెట్ లో పెట్టకుండా, అసెంబ్లీకి చెప్పకుండా మరీ అప్పులు తీసుకొస్తున్నారంటూ విపక్షాలు రోజూ ఆరోపిస్తూనే ఉన్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం ఎక్కడా వెనక్కితగ్గడం లేదు. ఓవేపు సంక్షేమ జాతరను, మరోవైపు ఉద్యోగుల జీతభత్యాలను భరించాలంటే ఈమాత్రం అప్పులు తప్పవంటోంది ప్రభుత్వం. అయితే ఇది ఎంతవరకూ అన్న దానిపైనే ఉత్కంఠ కొనసాగుతోంది.

వరుసగా పన్నుల మోత
ఏపీలో ప్రభుత్వం తాజాగా మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఇక మిగిలింది రెండేళ్లే. ఈ రెండేళ్లలో ప్రభుత్వం ఏం చేస్తుందనే దానిపైనే తిరిగి ఎన్నికవుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇలాంటి కీలక సమయంలో ప్రభుత్వం వరుసగా పన్నుల మోత మోగిస్తోంది. చెత్త పన్నుతో మొదలుపెట్టి ఆస్తిపన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు ఇలా ప్రతీ విషయంలోనూ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఇది అంతిమంగా జనానికి చుక్కలు చూపిస్తోంది. అయితే ఇప్పటివరకూ సంక్షేమపథకాల్ని ఎంజాయ్ చేస్తున్న జనం కూడా ఈ పన్నుల మోత ధాటికి వేసవిలో తాపం కంటే ఎక్కువగా ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

మరిన్ని మోతలకు దారుల అన్వేషణ
ఇప్పటికే కనిపించిన ప్రధాన పన్నులంటినీ పెంచేస్తున్న ప్రభుత్వం త్వరలో అన్ని శాఖల్లోనూ పన్నుల పెంపు, ఛార్జీల మోతకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి రాబడి పెంచేందుకు అధికారులు దారులు వెతుకుతున్నారు. పాత చట్టాల్ని సవరించి మరీ పన్నుల పెంపుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీలైన చోట్ల కొత్త పన్నులు విధించేందుకు సిద్దమవుతున్నారు. దీంతో మండు వేసవిలో ఏపీ ప్రజలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల పెరిగిన పన్నుల వసూలుకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.ఇప్పుడు కొత్త పన్నులు కూడా విధిస్తే తట్టుకోవడం కష్టమేనంటున్నారు.

జగన్ కు మిగిలింది ఏడాదేనా ?
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ రాబోయే ఏడాదే వైసీపీ సర్కార్ కు కీలకంగా మారబోతోంది. ఎందుకంటే ఎన్నికల ఏడాది పన్నులు, ఛార్జీల మోత మోగిస్తే మాత్రం ఎన్నికలపై దాని ప్రభావం పడటం ఖాయం. అసలే ఛార్జీలు పెంచబోనని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. ఇప్పుడు వాటిని సమర్ధించుకోవడం కష్టం. అందుకే ఎన్నికలకు ఏడాది ముందే అన్ని ఛార్జీల్ని ఓసారి సవరించేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రభుత్వ ఖజానా నింపుకోవడంతో పాటు ఎన్నికలకు ముందు కొత్త పథకాలు ప్రవేశపెట్టే ఆలోచనలు కూడా చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications