మహిళ సూసైడ్: ఏలూర్లో లాయర్ హత్య.. కేసులో ఓ హీరో అభిమాని!
విశాఖ: ఏపీలోని విశాఖ జిల్లా పెందుర్తిలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్త విడాకుల నోటీసు పంపినందుకు ఆమె అపార్టుమెంటు భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సోమవారం నాడు ఈ సంఘటన జరిగింది.
మృతురాలు గంగోత్రికి 2005లో పెళ్లి జరిగింది. ఐదారేళ్లు కాపురం అనంతరం భర్తతో విడిపోయింది. గత అయిదేళ్లుగా ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. తాజాగా, ఆమె భర్త విడాకుల నోటీసు పంపించారు. అనంతరం ఆమె అపార్టుమెంటు పైనుంచి దూకింది. ఆమె ఆత్మహత్యకు విడాకుల నోటీసు కారణమా? మరేదైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాహుల్ ధర్ అనే విద్యార్థి కళాశాల హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రాహుల్ స్వస్థలం విజయనగరం.
ఏలూరులో న్యాయవాది దారుణ హత్య
ఏలూరులో సోమవారం మధ్యాహ్నం ఓ లాయర్ దారుణ హత్యకు గురయ్యారు. రాయల్ అనే న్యాయవాది వన్టౌన్లో ఓ దుకాణంలో ఉండగా నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాయల్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ హత్య కేసులో కీలక సుత్రధారి ప్రభు అనే వ్యక్తి తెలుస్తోంది. అతను ఓ ప్రముఖ హీరోకి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుతో పాటు మిగతా వారు పరారీలో ఉన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి పేరు ప్రవీణ్ అని తెలుస్తోంది.
అగ్ని ప్రమాదం, ఇళ్లు దగ్ధం
పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వూరచెరువు గట్టుపై గుడిసెలు వేసుకుని ఉంటున్న పేదల ఇళ్లల్లో అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు నలభై ఇళ్లు దగ్ధమయ్యాయి. ఎండ వేడిమి కారణంగా పూరి గుడిసెకు మంటలు అంటుకొని, వ్యాపించడం వల్ల దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఓ బాలుడు సజీవ దహనం అయినట్లుగా తెలుస్తోంది.