తన భార్యను కిడ్నాప్ చేశారంటూ అత్తామామలపై ఫిర్యాదు
విశాఖపట్నం: నగరంలో కిడ్నాప్ కలకలం రేగింది. తన భార్యను తన అత్తామామలు కిడ్నాప్ చేశారంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. తమ ప్రేమ వివాహానికి అంగీకరించని తన అత్తామామలు బలవంతంగా తన భార్యను ఎత్తుకెళ్లారని తెలిపాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బుధవారం మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు.
వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం నగరానికి చెందిన రాజేష్, పూజ అనే యువతి ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి పూజ తల్లిదండ్రులు అంగీకరించకుండా.. ఆమెకు వేరే వివాహం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పూజ ఇంటి నుంచి పారిపోయి రాజేష్ వద్దకు వచ్చింది.
రాజేష్-పూజలు ఇటీవలే విశాఖపట్నంలో వివాహం చేసుకున్నారు. కాగా, వీరిద్దరూ ఇంట్లో ఉండగా సోమవారం తెల్లవారుజామున పోలీసులమని చెప్పి ఇంట్లోకి ప్రవేశించిన తన అత్తామామలకు సంబంధించిన 30మంది పూజను బలవంతంగా ఎత్తుకెళ్లారని రాజేష్ ఆరోపించాడు.
వాహనంలో తీసుకెళుతుండగా దగ్గరలోని ఓ పోలీసుకు చెప్పిన అతడు స్పందించలేదని చెప్పాడు. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశానని చెప్పాడు. వెంటనే స్పందించి తన భార్యను తీసుకురావాలని విజ్ఞప్తి చేసినప్పటికీ.. పోలీసులు పట్టించుకోలేదని రాజేష్ ఆరోపించాడు.
వెంటనే స్పందించివుంటే తన భార్యను వెనక్కి తీసుకువచ్చే అవకాశం ఉండేదని చెప్పాడు. ఫిర్యాదు చేసి 48గంటలైనా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించాడు.