దారుణం: ప్రియుడి మోజులో భర్త హత్య, అదే పట్టించింది
హైదరాబాద్: ప్రియుడి మోజులో భర్తను కిరాయి హంతకులతో హత్య చేయించిన భార్య ఉదంతం మరోకటి హైద్రాబాద్లో వెలుగు చూసింది. భర్తను హత్య చేయించి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితురాలు ప్రయత్నాలు చేసింది. అయితే ఈ కేసులో ప్రియుడి సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ బోరబండలో నివాసముండే 46 ఏళ్ల మహ్మద్ ఖాజాకు 26 ఏళ్ల యువతితో రెండో వివాహం జరిగింది. అయితే వీరి మధ్య వయసు తేడా ఉండడంతో సంసార జీవితంలో మనస్పర్థలు వచ్చాయి.
ఈ క్రమంలోనే అదే ప్రాంతానికి చెందిన ఖురేషీ అనే వ్యక్తితో ఆ వివాహితకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త మహ్మద్ ఖాజాను చంపితే పెళ్లి చేసుకోవచ్చని పథకం వేశారు. ఈ మేరకు ఖురేషీ మరో ముగ్గురు స్నేహితుల సహాయంతో ఖాజాకు మద్యం తాగించి దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని స్థానికంగా ఉన్న రైలు పట్టాలపై పడేశారు.
భర్త చనిపోయిన తర్వాత తన భర్త కన్పించడం లేదంటూ ఏమీ తేలియనట్టుగానే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
భర్త కోసం వెతుకుతున్నట్టుగా నటించింది.అంతేకాదు భర్త శవాన్ని రైలు పట్టాలపై వేసి ఆత్మహత్యచేసుకొన్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది. ప్రియుడి మోజులో ఉండి ఆమె ఈ రకంగా వ్యవహరించిందని పోలీసులు గుర్తించారు. ఈ కేసు విచారణ చేసిన పోలీసులకు దిమ్మతిరిగే విషయాలను గుర్తించారు.
భార్యే తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించిందని విచారణలో పోలీసులు గుర్తించారు.వివాహిత, ఆమె ప్రియుడు ఖురేషీతో పాటు అతని స్నేహితులు ముజీబ్, అయాజ్, అక్బర్ బేగ్, జబీర్లను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇలా గుర్తించారు
తొలుత ఈ కేసును ఆత్మహత్యగా భావించారు. అయితే మృతదేహంపై ఉన్న దెబ్బలు, సంఘటన స్థలంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఆనవాళ్ళు, రక్తం మరకల ఆధారంగా హత్యగా రైల్వే పోలీసులు అనుమానించారు. దీంతో రైల్వే పోలీసులు ఈ కేసును సనత్ నగర్ పోలీసులకు బదిలీ చేశారు. సనత్ నగర్ పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. మృతదేహంపై ఉన్న గాయాలే హత్యగా పోలీసులు అనుమానానికి కారణమైంది.