భర్త ఇంటిముందు భార్య ధర్నా, మరోచోట ప్రియురాలు
వరంగల్/కరీంనగర్: తనను తన భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ ఓ మహిళ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్కు చెందిన శ్వేతకు వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం భీమారంకు చెందిన అనిల్ కుమార్తో వివాహం అయింది.
అనిల్ హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇరవై అయిదు లక్షల రూపాయలు కట్నంగా తీసుకొని పెళ్లి చేసుకున్నాడని, అయినా ఇంకా అదనపు కట్నం కావాలంటూ తనను వేధిస్తున్నాడని శ్వేత ఆరోపిస్తోంది. అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడని ఆరోపిస్తున్న ఆమె భర్త ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగింది. తనకు న్యాయం చేసే వరకు నిరాహార దీక్షను కొనసాగిస్తానని ఆమె చెప్పింది.

మరోచోట ప్రియుడి ఇంటి ముందు ధర్నా
తనను నమ్మించి గర్భవతిని చేసిన ప్రియుడితోనే తనకు వివాహం జరిపించి న్యాయం చేయాలని కోహెడ మండలం సముద్రాలలో ప్రియుడి ఇంటి ముందు రజని అనే యువతి బైఠాయించింది. ఆమె రెండు రోజుల పాటు ప్రియుడి శ్రీకాంత్ ఇంటి ముందు బైఠాయించింది. ఆమెకు పలు మహిళా సంఘాలు, గ్రామస్తులు మద్దతు పలికారు. ప్రియుడి ఇంటి ఎదుట వంటా వార్పు నిర్వహించారు. ధర్నా చేశారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని న్యాయం చేస్తామని చెప్పినా ఆమె తగ్గలేదు. రాజకీయ ఒత్తిడితో పోలీసులు కేసును పక్కదారి పట్టిస్తున్నారని, శ్రీకాంతుతో పెళ్లి జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని రజనీ స్పష్టం చేశారు. మహిళా సంఘాలు ఉద్యమించేందుకు సిద్ధమన్నాయి. పోలీసులు మళ్లీ మళ్లీ మాట్లాడి తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు.












Click it and Unblock the Notifications