భర్త ఇంటి వద్ద భార్య ధర్నా: ఆస్తి కోసం కన్నకూతుర్నే హత్య
కడప/ ఒంగోలు: కడప జిల్లాలో ఓ మహిళ తన అత్తారింటి ముందు ధర్నాకు దిగింది. అదనపు కట్నం కోసం అత్తారింటి వారు పెడుతున్న బాధలను తట్టుకోలేక ఓ వివాహిత మహిళ రాజంపేటలో తన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది.
రాజంపేటలోని గాజుల వీధిలో నివాసం ఉంటున్న ప్రియాంక దంపతులకు 2014లో వివాహం జరిగింది. అప్పటి నుంచి భర్త అమర్నాథ్ కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని మహిళ ఆరోపిస్తోంది. అత్తా మామలకు తోడు ఆడపడుచు కూడా తనను కొడుతోందని ప్రియాంక ఆరోపించారు.
అన్ని కష్టాలు భరించి ఇంట్లోనే మౌనంగా ఉంటున్న ఆమెను బుధవారం ఇంటి నుంచి గెంటేశారు. భర్త కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. భర్త అమర్నాథ్ ప్రొద్దుటూర్ పోస్టల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. తనకు న్యాయం జరిగేంత వరకు భర్త ఇంటి ముందు నుంచి కదిలేది లేదని ప్రియాంక స్పష్టం చేశారు.

ఇదిలావుంటే, ప్రకాశం జిల్లా చీరాలలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆస్తికోసం ఓ వ్యక్తి తన కన్న కూతుర్నే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కొడుకు ఫిర్యాదుతో దర్యాప్తు జరిపిన పోలీసులు తండ్రి దారుణాన్ని వెల్లడించారు.
కటకం దుర్గా భవానీ అనే 15 ఏళ్ల అమ్మాయి గత నెల 3వ తేదీన మరణించింది. ప్రేమ విఫలం కావడంతో తన కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి వెంకటేశ్వర్లు అందరినీ నమ్మించాడు. వారణాసిలో ఉంటున్న వెంకటేశర్లు కుమారుడికి తండ్రి ప్రవర్తనపై అనుమానం కలిగింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విచారణలో తండ్రి, అతని సోదరి కుటుంబ సభ్యులతో కలిసి హత్య చేసినట్లు వెలుగు చూసింది. దుర్గా భవానీ పేరుతో రూ. 50 లక్షల ఆస్తి ఉంది. అయితే ఆమె పోలయ్య అనే వ్యక్తిని ప్రేమించింది. పలు మార్లు ఆయనతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. నచ్చజెప్పి కూతురుని ఇంటికి తీసుకువచ్చి ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications