దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భార్య: 8 ఏళ్ల తర్వాత వచ్చిందని చేరదీస్తే.. అసలుకే ఎసరు..
ఏలూరు: మానవ సంబంధాలన్ని ఆర్థిక సంబంధాలేనన్న విషయం మళ్లీ మళ్లీ రుజువవుతూనే ఉంది. డబ్బున్నంత సేపు చుట్టూ మనుషులు.. హడావుడి.. ఆ లెక్కే వేరు. అదే డబ్బు లేకపోతే.. పక్కనే తిరిగినవాళ్లు కూడా పలకరించడానికి పదిసార్లు ఆలోచిస్తారు.
పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరులో చోటు చేసుకున్న ఓ సంఘటనను గమనిస్తే ఇదే విషయం నిజమనిపించకమానదు. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం భర్తను వదిలేసి వెళ్లిన భార్య ఇటీవల హఠాత్తుగా అతని వద్దకు వచ్చి పాత ప్రేమను కనబరిచింది. అంతలోనే మళ్లీ అతన్ని విడిచి వెళ్లిపోయింది. ఈ మొత్తం వ్యవహారం డబ్బు చుట్టే తిరగడం గమనార్హం.
ఇదీ అసలు వ్యవహారం:
కుక్కునూరు మండలం బెస్తగూడేనికి చెందిన దానూరి వీరయ్యకు అశ్వారావుపేట మండలం వినాయకపురానికి చెందిన నాగలక్ష్మితో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నాగలక్ష్మి భర్తను విడిచి వెళ్లిపోయింది. అలా గత ఎనిమిదేళ్లుగా నాగలక్ష్మి భర్తకు దూరంగా వినాయకపురంలోనే ఉంటోంది.
యువకునితో పరిచయం:
భర్తను విడిచి దూరంగా ఉంటున్న నాగలక్ష్మికి విజయ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఎన్నడూ భర్త గురించి ఆమె ఆలోచించలేదు. కానీ ఇటీవల పోలవరం ప్రాజెక్టు కింద నష్టపోయిన రైతులకు పరిహారం అందిందని తెలియగానే.. వెళ్లి భర్త ముందు వాలిపోయింది. పోలవరం పరిహారం సొమ్ము కింద వీరయ్యకు రూ.15లక్షలు వచ్చాయి.
ఏటీఎం కార్డు దొంగిలించి:
భార్య అసలు ఉద్దేశాన్ని గమనించని భర్త మునుపటిలానే చేరదీశాడు. ఇద్దరూ కొద్దిరోజులు బాగానే ఉన్నారు కూడా. అయితే భర్త వద్ద ఉన్న డబ్బు పైనే కన్నేసిన భార్య.. అతని ఏటీఎం కార్డు తస్కరించింది. పెట్టెలో ఉన్న అతని ఏటీఎం కార్డు దొంగిలించి.. ఆ స్థానంలో తన ఏటీఎం కార్డు పెట్టింది. కార్డు దొరికిన తర్వాత ఇక భర్తతో పనేముందనుకున్న నాగలక్ష్మి.. మళ్లీ వినాయకపురం వెళ్లి ప్రియుడికి దగ్గరలోనే ఉంటోంది.
నిలదీసినందుకు.. ఆత్మహత్యాయత్నం:
వేర్వేరు ప్రాంతాల నుంచి ఏటీఎంలోని సొమ్మును నాగలక్ష్మి డ్రా చేసింది. వారం క్రితం వీరయ్య పెట్టెలోని కార్డు తీసి పరీశిలించగా నాగలక్ష్మి తన కార్డు దొంగిలించినట్లు గుర్తించాడు. బ్యాంకులో విచారిస్తే రూ.9లక్షలు అప్పటికే డ్రా చేసినట్లు తేలింది.
దీంతో వినాయకపురంలో పెద్ద మనుషుల సమక్షంలో నాగలక్ష్మిని వీరయ్య నిలదీశాడు. వీరయ్యకు సమాధానం చెప్పలేక నాగలక్ష్మి గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలుస్తోంది.