ఇలాగే ఉంటాం, అలా అన్లేదు: బొజ్జల, ఎర్రచందనం కీలక అనుమానితుల అరెస్ట్!
హైదరాబాద్: ఎర్రచందనం దొంగల విషయంలో తమ విధానం ఇలాగే ఉంటుందని, శేషాచలం ఎన్కౌంటర్ విషయంలో తాను అంతం కాదు ఆరంభం అంటూ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి ఆదివారం అన్నారు.
శేషాచలం ఎన్కౌంటర్లో మృతి చెందిన వారి వద్ద నుండి తాము సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సదరు సెల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో అడవులను రక్షించేందుకు రూ.100 కోట్లు అయినా ఖర్చు చేస్తామన్నారు.
శేషాచలం ఎదురు కాల్పుల ఘటన పైన చట్ట ప్రకారం విచారణ చేపడతామన్నారు. ఎర్ర చందనం వేలం ద్వారా వెయ్యి కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశముందని చెప్పారు. ఇలా వచ్చిన ఆదాయంలో తిరిగి ఎర్ర చందనం సంరక్షణ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తామన్నారు.
ఎర్రచందనం కీలక అనుమానితుడు అదుపులో?
శేషాచలం ఎన్కౌంటర్ కేసులో కీలక అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మృతి చెందిన కూలీల వద్ద దొరికిన సెల్ ఫోన్ చిట్టా ఆధారంగా వారు కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం.