కొత్త జిల్లాల ప్రక్రియపై ఉద్యోగుల పోరు ప్రభావం-సహకరిస్తారా ? మరో ఒత్తిడి పెంచే యత్నం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ పోరు నానాటికీ తీవ్రమవుతోంది. ఇప్పటికే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు పీఆర్సీ పోరులోకి వచ్చేశారు. నిన్నటి నుంచి విధులు బహిష్కరించి ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరశంఖం పూరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం దీన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకేనా అన్నట్లు కొత్త జిల్లాల ఏర్పాటును తెరపైకి తెచ్చింది. ఇందుకోసం ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో ఉద్యోగులు పాలుపంచుకుంటారా లేదా అన్నది ఇంకా తేలలేదు.
ఉద్యోగుల పీఆర్సీ పోరు
ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్రవ్యాప్త్గంగా పలు చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. వచ్చే నెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామని ఉద్యోగులు ప్రభుత్వానికి నోటీసు కూడా ఇచ్చారు.
అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గే పరిస్ధితులు కనిపించడం లేదు. ఓవైపు ఉద్యోగులకు ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమని, వారిని చర్చలకు ఆహ్వానిస్తున్న ప్రభుత్వం.. మరోవైపు మాత్రం పీఆర్సీ అమలుపై తమ పని తాము చేసుకుపోతోంది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది.
కొత్త జిల్లాల్ని తెరపైకి తెచ్చిన జగన్
ఏపీలో ఉద్యోగులు పీఆర్సీ పోరు ప్రారంభించి సమ్మెకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టి వారిపైనే ఉంటుంది. మరోవైపు రోజువారీ పాలనపైనా దీని ప్రభావం ఉంటుంది. దీంతో ప్రభుత్వం కూడా ఉద్యోగుల పోరు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కొత్త జిల్లాలను తెరపైకి తెచ్చింది. గతంలో తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమల్లోకి తెచ్చేసింది. దీంతో ఇప్పుడు కొత్త జిల్లాలు, వాటి సరిహద్దులు, జిల్లాల పేర్లు వంటి విషయాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమవుతోంది. ఈ వ్యవహారం సహజంగానే ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది.
ఉద్యోగులు సహకరిస్తారా?
ఏపీలో పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా తాము ప్రారంభించిన పోరాటాన్ని పక్కదోవ పట్టించేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాల వ్యవరహారాన్ని తెరపైకి తెచ్చిందని భావిస్తున్న ఉద్యోగులు.. దీన్ని ఎదుర్కొనేందుకు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ప్రభుత్వం తెరపైకి తెచ్చిన కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారంలో పాలు పంచుకోవాలా లేదా అనే దానిపై ఉద్యోగులు మల్లగుల్లాలు పడుతున్నారు.
పీఆర్సీ సాధన సమితి ఈ మేరకు చర్చలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో తమను భాగస్వాముల్ని చేయడం ద్వారా పీఆర్సీ పోరును పక్కదోవ పట్టించేందుకు ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో దీనికి సహకరించరాదనే డిమాండ్లు ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి.
ఉద్యోగులు దూరంగా ఉంటే?
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ఉద్యోగుల పాత్ర కీలకం. కొత్త జిల్లాలపై ప్రజాభిప్రాయం సేకరించాలన్నా, ఉత్తర్వులు జారీ చేయాలన్నా, వాటిని క్షేత్రస్దాయిలో అమల్లో పెట్టాలన్నా ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంటుంది. అలాంటిది ఉద్యోగులు సమ్మెకు వెళ్తున్న సమయంలో ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రక్రియను తెరపైకి తెచ్చింది.
దీంతో ఇప్పుడు ఉద్యోగులు కచ్చితంగా సమ్మెను వదిలిపెట్టి ఈ ప్రక్రియలో పాలుపంచుకోవాల్సి ఉంటుంది. అలా కాదని ఉద్యోగులు దూరంగా ఉండిపోతే కొత్త జిల్లాల ప్రక్రియ మూలనపడుతుంది. అప్పుడు ప్రజల్లోనే వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల్ని మరింత ఒత్తిడిలోకి నెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్ధమవుతోంది. మరి దీనికి ఉద్యోగులు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇవాళ, రేపట్లో తేలిపోనుంది.