నోటిఫికేషన్ ఇచ్చేశా- తేడా వస్తే మీదే బాధ్యత- సుప్రీంకైనా వెళతా- నిమ్మగడ్డ హెచ్చరికలు
ఏపీలో అనుకున్నట్లుగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్. ప్రభుత్వం నుంచి ఎదురైన అభ్యంతరాలను, సుప్రీంకోర్టులో ప్రభుత్వ పిటిషన్ను లెక్కచేయకుండానే నోటిఫికేషన్ విడుదల చేసేశారు. అంతే కాదు ఎన్నికలను రాజ్యాంగ బద్ధంగా నిర్వహిస్తానని, అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని జగన్ సర్కారుకు హెచ్చరికలు చేశారు. ఎన్నికలకు ఏ విధంగానైనా అంతరాయం కలిగితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అవసరమైతే దీనిపై గవర్నర్తో పాటు సుప్రీంకోర్టునూ ఆశ్రయిస్తానన్నారు.
జగన్ సర్కారుపై నిమ్మగడ్డ కీలక వ్యాఖ్యలు
ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ బాధ్యత దృష్ట్యా ఎన్నికల అవసరాన్ని గుర్తుచేస్తూనే ప్రభుత్వం తమకు ఏ విధంగానూ సహకరించలేదని ఆరోపించారు. అలాగే ఎన్నికల కమిషన్కు ఎలా అడ్డంకులు కల్పించారన్న విషయాన్నీ నిమ్మగడ్డ వెల్లడించారు. దీనిపై తగిన సమయంలో చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఎన్నికలను అడ్డుకోవాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎన్నికలు ఆపలేం, సుప్రీం తీర్పును పాటిస్తాం...
రాజ్యాంగ ఆదేశాల మేరకు స్ధానిక సంస్ధల ఎన్నికలు సకాలంలో నిర్వహించడం కమిషన్ విధి అని ఎస్ఈసీ నిమ్మగడ్డ తెలిపారు. ఇప్పటికే ఆలస్యమైన ఎన్నికలు హైకోర్టు ఆదేశాల మేరకే చేపడుతున్నట్లు నిమ్మగడ్డ తెలిపారు. న్యాయవివాదాలు ఉన్నప్పటికీ హైకోర్టు తీర్పుతో వీటికి తెరపడిందని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో తుది నిర్ణయం వస్తే మాత్రం తప్పనిసరిగా పాటిస్తామన్నారు. హైకోర్టు ఇరువైపులా వాదనలు విన్నాక సహేతుకమైన తీర్పు ఇచ్చిందని, ప్రభుత్వం, కమిషన్ కూడా తమ వాదనలు వినిపించాయని ఆయన గుర్తుచేశారు. అన్ని విషయాలు ఆలోచించాకే హైకోర్టు తమ వాదన విశ్వసించి ఎన్నికలకు అనుమతిచ్చిందని అన్నారు. కమిషన్కు న్యాయవ్యవస్ధపై పూర్తి నమ్మకం, గౌరవం, విశ్వాసం, విధేయత ఉన్నాయని నిమ్మగడ్డ తెలిపారు. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలను కమిషన్ వెంటనే అమలు చేసిందని గుర్తుచేశారు.
11 జిల్లాల్లో రెవెన్యూ డివిజన్ల ప్రాతిపదికన ఎన్నికలు
నాలుగువిడతలుగా జరిగే పంచాయతీ ఎన్నికలు పూర్తిగా జిల్లా కలెక్టర్ల సూచన మేరకు, స్ధానిక పరిస్ధితులు, వ్యాక్సినేషన్ ఆధారంగా రూపొందించినట్లు నిమ్మగడ్డ వెల్లడించారు. ప్రకాశం, విజయనగరం మినహా మిగిలిన జిల్లాల్లో రెవెన్యూ డివిజన్ల ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతాయన్నారు. ప్రజా అవసరాల దృష్ట్యా ఏడు గంటల నుంచి ఒంటిగంట వరకూ ఉన్న సమయాన్ని ఆరున్నర నుంచి మూడున్నర వరకూ పెంచామన్నారు. నాలుగు గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తిగా ఉన్నాయనే నిర్ణయానికి కమిషన్ వచ్చిందని నిమ్మగడ్డ తెలిపారు. నిదుల విషయంలో మధ్యాహ్నం మూడు గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్, ఇతర అధికారులతో చర్చిస్తామని, విధిగా హాజరవ్వాలని వారిని కోరినట్లు ఎస్ఈసీ తెలిపారు.
2019 ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు
ప్రభుత్వ పరంగా కమిషన్కు తోడ్పాటులో మిశ్రమానుభవాలున్నాయని నిమ్మగడ్డ తెలిపారు. సీఎస్, డీజీపీ పరిణితి చెందిన అధికారులని, వారితో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనకు సత్సంబంధాలున్నాయని నిమ్మగడ్డ వెల్లడించారు. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించాలనే మేం ముందునుంచీ కోరుకున్నామన్నారు. కానీ పంచాయతీ రాజ్శాఖ మాత్రం మెరుగైన పనితీరు కనబర్చలేకపోయింని ఆయన ఆరోపించారు. పంచాయతీ రాజ్ కమిషనర్ కు ఎన్నికల ప్రక్రియ సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉందని,కానీ జిల్లాల్లో పరిస్ధితి మాత్రం అలా లేదన్నారు. ఎన్నికలపై కమిషనర్, ముఖ్యకార్యదర్శి తీవ్రంగా విఫలమయ్యారని నిమ్మగడ్డ పేర్కొన్నారు. కోర్టుకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిందని, 2021 ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు జరుపుతామని హైకోర్టుకు హామీ ఇచ్చినా సాధ్యం కాలేదని. కాబట్టి 2019 ఓటర్ల జాబితా ఆధారంగానే విధిలేని పరిస్ధితుల్లో ఎన్నికలు జరపాల్సి వస్తోందన్నారు.
ఓటు హక్కు కోల్పోయిన 3.6 లక్షల మంది
ఏపీ ప్రభుత్వ చర్యతో రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన 3.6 లక్షల మంది ఓటుహక్కు కోల్పోతున్నారని నిమ్మగడ్డ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 ద్వారా వారికి సంక్రమించిన హక్కును కోల్పోతున్నాని తెలిపారు. పంచాయతీరాజ్శాఖ చర్యలతో ఈ పరిస్ధితి వచ్చిందన్నారు. సరైన సమయంలో పంచాయతీ రాజ్ కమిషనర్పై చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నో సమస్యలున్నా ఏదో రకంగా ఎన్నికలు జరపాలని కమిషన్ నిర్ణయించిందన్నారు. సోమవారం సుప్రీంలో కేసు విచారణకు వస్తుంది కాబట్టి నోటిఫికేషన్ వాయిదా వేయమని కోరింది, కానీ సహేతుకంగా లేదని తిరస్కరించామన్నారు. కాబట్టి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనట్లే అన్నారు.
అధికార రహస్యాల గోప్యత పాటించని సర్కారు
గవర్నర్తో పాటు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారితో జరిపిన చర్చలు ఎప్పుడూ గోప్యంగా ఉండాల్సిందేనని ఎస్ఈసీ నిమ్మగడ్డ తెలిపారు. కానీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ మాత్రం తనకు చేరకుండానే పత్రికల్లో, మీడియాల్లో వచ్చిందని గుర్తుచేశారు. మంచి సంస్కృతిని, గోప్యతను పాటించాలని కోరుతున్నామన్నారు. ఆర్టీఐ నుంచి కూడా రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి మినహాయింపు ఉంది. కాబట్టి గోప్యత పాటించమని కోరుతున్నట్లు నిమ్మగడ్డ తెలిపారు. ఎన్నికలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నా వీటి ప్రభావం పోటీ చేసే అభ్యర్ధులపై ఉండదని విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అవరోధాలు కల్పిస్తే కఠిన చర్యలు- గవర్నర్, సుప్రీం వద్దకూ..
అభ్యర్ధులు పోటీ చేయడంలో అవరోధాలు కల్పిస్తే కమిషన్, పోలీసుశాఖ తీవ్రంగా పరిగణించి స్పందిస్తాయని నిమ్మగడ్డ హెచ్చరించారు.
స్వేచ్ఛగా, న్యాయబద్దంగా ఎన్నికలు జరపడమే తమ లక్ష్యం అన్నారు. రాష్ట్రంలో గతానుభవాల దృష్ట్యా ఏకగ్రీవాలపైనా ఈసారి పూర్తిగా దృష్టిపెడతామన్నారు. ఇందుకోసం ఐజీ స్ధాయి అధికారిని నియమిస్తామన్నారు. ఎన్నికలపై సమాజంలో, ఓటర్లలో ఆసక్తి ఉందని, వారి ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే నైతికంగా కూడా సమర్ధనీయం కాదన్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు గవర్నర్, న్యాయవ్యవస్ధ దృష్టికీ తీసుకెళ్లడం ద్వారా సవాళ్లను అధిగమించి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు ప్రయత్నిస్తానని నిమ్మగడ్డ తెలిపారు. ఇందులో తన వ్యక్తిగతమేదీ లేదన్నారు. ఎన్నికలు నిరవధికంగా కానీ, పాక్షికంగా కానీ వాయిదా వేయాలన్న వాదనలో హేతుబద్ధత లేదనే తిరస్కరించినట్లు నిమ్మగడ్డ గుర్తుచేశారు. గవర్నర్ నుంచి ఈ విషయంలో పూర్తి తోడ్పాడు లభిస్తుందని ఆశిస్తూ ఈ ప్రక్రియ ప్రారంభిస్తున్నామన్నారు. కలెక్టర్లు, ఇతర అధికారుల నుంచి కూడా సహకారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో అవరోధాలు కానీ, ఆటంకాలు కానీ ఎదుర్కొంటే దీని బాధ్యత ప్రభుత్వానిదే. దీన్ని గవర్నర్కు నివేదించక తప్పదు. ఎన్నికలను అడ్డుకుంటే పరిణామాలు ప్రభుత్వం ఎదుర్కోక తప్పదు. అలా జరగదని భావిస్తున్నాను. జరిగితే మాత్రం ఇందుకు బాధ్యులు ఎవరో గవర్నర్కు ఫిర్యాదు చేయక తప్పదు. అవసరమైతే సుప్రంకోర్టుకు కూడా నివేదించక తప్పదు. ఉన్న పరిస్దితి చెప్పాల్సి ఉంటుంది.