బిజెపికి మద్దతు ఉపసంహరణ ఎంతపని, హోదా స్వర్గమా, సాక్షి అంతే: జగన్పై బాబు భగ్గు
విజయవాడ: తాము కేంద్రంతో కలిసే వెళ్తామని, ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించుకోవడం పెద్ద పని కాదని, కానీ అలా చేస్తే ఇక నాకున్న అనుభవం ఏమిటని, ప్రజలు తన పైన ఎంతో బాధ్యత పెట్టారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు.
రాష్ట్ర అభివృద్ధి సాధించాలంటే కేంద్రం సాయం కావాలన్నారు. వారితో కలిసే వెళ్తామని స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్నారు. కేంద్రంతో విరోధం అంటే ఏం సాధించలేమని అభిప్రాయపడ్డారు. సాధించేది ఏమీ ఉండదన్నారు.
విజయవాడలోని ముఖ్యమంత్రి విడిది కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం శనివారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు... వైసిపి అధినేత వైయస్ జగన్ దీక్ష, ప్రత్యేక హోదా తదితర అంశాలపై అిగారు.

దానికి చంద్రబాబు మాట్లాడారు. జగన్ నేను భయపడుతున్నానని విమర్శిస్తున్నాడని, అసలు నేను ఎందుకు భయపడాలో చెప్పాలన్నారు. కేంద్రానికి మద్దతు ఉపసంహరణ పెద్ద పని కాదన్నారు. కానీ రాష్ట్రానికి వచ్చే లాభం ఏమిటో చెప్పాలన్నారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినందున కేంద్రం సాయం అవసరమన్నారు. ప్రత్యేక హోదా సాధిస్తే ఏపీ స్వర్గమైపోతుందా అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధించిన మిగతా రాష్ట్రాలు స్వర్గాలు కాలేదు కదా అన్నారు. మనకు హోదాతో పాటు ప్యాకేజీ కావాలన్నారు.
ప్రత్యేక హోదాతోనే అంతా అయిపోదని, ప్యాకేజీ కావాలని, పెద్ద ఎత్తున ప్రాజెక్టు కావాలని, రాష్ట్రానికి డబ్బులు అవసరమన్నారు. కేంద్రం హోదా కంటే ఎక్కువ డబ్బులు ఇస్తామని చెబుతోందన్నారు. ఇప్పటికే కేంద్రం డ్రెడ్జింగ్ హార్బర్, ఎయిమ్స్, బెల్ తదితర అనేక జాతీయ సంస్థలు ఇచ్చిందని, ఇంకా వస్తున్నాయన్నారు.
జగన్ రాజకీయ అనుభవం ఏమిటి? ఆయనకేం తెలుసు? అన్నారు. ఆయనకు చెందిన సాక్షి పత్రిక ఉంది కదా అని పేజీలు పేజీలు హోదా కోసం రాసేస్తే సరిపోతుందా అని నిలదీశారు. ప్రతిక్షణం రాష్ట్ర ప్రయోజనాల కోసమే తపన పడుతున్నానని, వారు దేనికి సహకరించారని ప్రశ్నించారు. అమరావతికి, పట్టిసీమకు, భోగాపురం విమానాశ్రయానికి.. ఇలా దేనికి సహకరించారో చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications