జగన్ పై పోరుకు సమరసంఖం పూరించిన బీజేపీ ? సీమలో దాడులు అందుకేనా !
స్ధానిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలోని కోస్తా జిల్లాలో టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్న వైసీపీ నేతలు.. రాయలసీమలో మాత్రం బీజేపీని టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లా పులిచర్లలో ఎంపీటీసీ అభ్యర్ధిగా నామినేషన్ వేయడానికి వెళుతున్న బీజేపీ నేతలపై వైసీపీ శ్రేణుల దాడులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఓవైపు రాయలసీమలో పోటీకి ప్రధాన విపక్షం టీడీపీ చేతులెత్తేస్తున్న నేపథ్యంలో ఆ స్ధానాన్ని భర్తీ చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు కారణమా అన్న వాదన మొదలైంది.

కోస్తా జిల్లాలో టార్గెట్ టీడీపీ
ఏపీలో జరుగుతున్న స్ధానిక ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలన్న ప్రయత్నాల్లో ఉన్న వైసీపీ ఇప్పటికే కోస్తా జిల్లాల్లో విపక్ష టీడీపీని టార్గెట్ చేసినట్లే కనిపిస్తోంది. టీడీపీకి చెందిన పలువురు నేతలపై పల్నాడుతో పాటు అమరావతి ప్రాంతంలోనూ వైసీపీ నేతలు చేస్తున్న తాజా దాడులు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. విపక్ష నేతలను నయానో, భయానో లొంగదీసుకోవడం ద్వారా వీలైతే ఎన్నికలను ఏకపక్షంగా మార్చేయడం లేదా వారిని పార్టీలోకి చేర్చుకోవడమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది..

రాయలసీమలో వేరే వ్యూహం...
స్ధానిక పోరులో గెలుపు కోసం కోస్తా జిల్లాలో టీడీపీ నేతలను టార్గెట్ చేసిన వైసీపీకి రాయలసీమలో ఆ అవసరం కనిపించడం లేదు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సీమ జిల్లాల్లో టీడీపీ నేతలంతా దాదాపుగా సైలెంట్ అయిపోయారు. అనంతపురం జిల్లాలో వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించిన జేసీ దివాకర్ రెడ్డి వంటి మహామహులే స్ధానిక పోరుకు దూరంగా ఉండిపోతున్నారు. జేసీ అంతటి వాడే ఎన్నికలకు దూరంగా ఉన్నప్పుడు మనకు మాత్రం ఎందుకులే అని టీడీపీకి చెందిన మిగతా నేతలంతా దాదాపుగా స్ధానిక పోరును లైట్ తీసుకున్నారు. అదే సమయంలో టీడీపీ స్ధానాన్ని భర్తీ చేసేందుకు బీజేపీ సిద్దమైపోయింది.

సీమ జిల్లాల్లో బీజేపీ ప్రభావం..
రాయలసీమకు న్యాయం చేయాలని, కర్నూల్లో హైకోర్టు పెట్టాలని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో సైతం రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలనే డిమాండ్ ను పొందుపరిచింది. ఇప్పుడు కర్నూలుకు వైసీపీ సర్కారు హైకోర్టు కేటాయించిన నేపథ్యంలో దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ నేతలు సిద్దమవుతున్నారు. అదే సమయంలో సీమకు న్యాయం కోసం కొన్నేళ్లుగా పోరాడుతున్నది తాము మాత్రమేనని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో స్ధానిక పోరు రావడం, టీడీపీ చేతులెత్తేయడం వంటి కారణాలతో పలుచోట్ల పోటీకి బీజేపీ సిద్దమైంది. ఇది ఇప్పుడు వైసీపీ నేతలకు కంటగింపుగా మారింది ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో టీడీపీని గత రెండు ఎన్నికలుగా దాదాపుగా ఊడ్చేసిన వైసీపీకి బీజేపీ రాక ఇబ్బందికరంగా మారింది. దాని ఫలితమే పులిచర్లలో వైసీపీ దాడులని స్ధానికంగా ప్రచారం జరుగుతోంది.
Recommended Video


సీమలో వైసీపీని బీజేపీ ఎదుర్కోగలదా ?
రాయలసీమలో ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో వైసీపీ దుర్బేద్యంగా కనిపిస్తోంది. ఇప్పట్లో విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఏవీ వైసీపీకి పోటీ ఇచ్చే పరిస్ధితి కూడా లేదుు. చాలా నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఆయా పార్టీలకు సరైన అభ్యర్దులు కూడా లేరు. ఇలాంటి పరిస్ధితుల్లో కేంద్రంలో తమకున్న బలాన్ని, వైసీపీతో సంబంధాలను దృష్టిలో ఉంచుకుని స్ధానికంగా పోరు మొదలుపెట్టాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీని ఫలితం ఎలా ఉన్నా రాయలసీమలో టీడీపీ పతనావస్ధను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనూ ఆయనకు ప్రత్యర్ధి అయిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సహా పలువురు నేతలను తమ పార్టీలో చేర్చుకున్న బీజేపీ.. భవిష్యత్తులో పరిణామాలు తమకు అనుకూలంగా మారతాయని గంపెడాశలు పెట్టుకుంది.












Click it and Unblock the Notifications