కర్నాటకపై బాబు-జగన్-పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్!: రంగంలోకి 'తెలుగు' బీజేపీ నేతలు
బెంగళూరు/హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం బీజేపీని ఇరకాటంలో పడేస్తోంది. ఇప్పటికే లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వారు గొంతెత్తుతున్నారు. శివసేన, అకాలీదళ్లు టీడీపీకి మద్దతిచ్చాయి.
మోడీ! చంద్రబాబు గొంతు విన్నారా, ఇంకా అర్థం చేసుకోలే, శాస్తి తప్పదు: మమత నిప్పులు
హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తున్నామని బీజేపీ చెబుతున్నప్పటికీ.. టీడీపీ, వైసీపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు చేస్తున్న ప్రచారం, ఢిల్లీలో ఎంపీల నిరసనలు దేశవ్యాప్తంగా బీజేపీని ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉత్తరాది కంటే దక్షిణాదిలో ప్రభావం
ఉత్తరాది మాట పక్కన పెడితే దక్షిణాదిన ఏపీకి హోదా ప్రభావం బీజేపీపై ఎక్కువగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ పాతుకుపోయింది. అంతేకాకుండా కేవలం పార్టీల పరంగా మాత్రమే మద్దతివ్వడం జరుగుతోంది. కానీ దక్షిణాది పరిస్థితి వేరు.
కర్నాటక నుంచి దక్షిణాదిన ప్రభంజనం
దక్షిణాదిన బీజేపీకి పట్టు లేదు. తెలంగాణ, ఏపీ, కేరళలో ఆ పార్టీ పరిస్థితి చెప్పాల్సిన పరిస్థితి లేదు. కర్నాటకలో గతంలో అధికారంలోకి వచ్చింది. త్వరలో జరగబోయే కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అధికారం చేజిక్కించుకొని దక్షిణాదిన ప్రభంజనం ప్రారంభించాలని భావిస్తోంది.
కర్నాటకలో తెలుగు వారు ఎక్కువ
గతంలో కర్నాటకలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. తెలుగు రాష్ట్రాల పక్కనే ఉండటంతో కన్నడనాట తెలుగువారు ఎక్కువ. అక్కడ ఎంతోమంది స్థిరపడ్డారు. ఏపీకి హోదా, విభజన హామీలు అమలు కాలేదనే ప్రచారం నేపథ్యంలో వారంతా బీజేపీకి బదులు కాంగ్రెస్ను లేదా ఇతరులను ఎంచుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
కర్నాటకలో తెలుగు ప్రభావం
కర్నాటకలోని బళ్లారి, కోలార్, కలబుర్గీ, బీదర్ తదితర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో తెలుగు ఓటర్లు ఉన్నారు. ఇతర ప్రాంతాల్లోను ఉన్నారు. తెలుగు రాష్టాల్లో జరిగే పరిణామాలు కర్నాటకలోని తెలుగు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. కానీ బీజేపీ అలా జరగవద్దని కోరుకుంటోంది.
వారికి సమాధానం
హోదా, విభజన హామీల అంశంలో ఇప్పుడు బీజేపీని అన్ని పార్టీలు బోనులో నిలబెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్నాటకలోని తెలుగు ఓటర్లు ఈ విషయాలపై ఆందోళనతో ఉండి ఉంటారని, వారికి సమాధానం చెప్పాల్సి ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
రంగంలోకి తెలుగు రాష్ట్రాల నేతలు
ఇందులో భాగంగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలను పార్టీ అధిష్టానం రంగంలోకి దించుతోంది. తెలుగు రాష్ట్రాల నేతలు తెలుగు ప్రజలు అధికంగా ఉండే చోట ప్రచారం నిర్వహించి.. తెలుగు రాష్ట్రాలపై అక్కడి వారిలో ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నాలు చేస్తారని చెబుతున్నారు.
ఏం జరిగిందో కన్నడ తెలుగు ఓటర్లకు చెబుతారు
ముఖ్యంగా, ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఎక్కువ ఇరకాటంలో పడేసింది. దీంతో పాటు ఉన్న పలు సమస్యలకు కేంద్రంలోని తమ ప్రభుత్వం (బీజేపీ లేదా ఎన్డీయే ప్రభుత్వం) కాదని వారికి ఏపీ-తెలంగాణ బీజేపీ నేతలు వివరించనన్నారు. తాము ఇచ్చిన హామీల మేరకు ముందుకు వెళ్తున్నామని, హామీల అమలుకు పదేళ్ల సమయం ఉందని, అలాగే కొన్ని అంశాల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టంలో సరిగా పొందుపర్చలేదని కర్నాటకలోని తెలుగు ప్రజలకు నచ్చ చెప్పనున్నారు. తద్వారా కన్నడనాట బీజేపీకి తెలుగు ప్రజలను దగ్గర చేసే ప్రయత్నాలు చేయనున్నారు.