కలకలం: రేవంత్ రెడ్డి కేసులో బాబు, లోకేష్లను ఫిక్స్ చేస్తారా?
హైదరాబాద్: ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వార్తాకథనం, జరుగుతున్న పరిణామాలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. తెలంగాణ టిడిపి శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసులో పట్టుబడడంతో చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా చిక్కుల్లో పడ్తారా అనే చర్చ సాగుతోంది. ఇందుకు అనుగుణంగానే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఓ వార్తాకథనం ప్రచురితమైంది.
నోటుకు వోటు కేసులో పట్టుబడిన 50 లక్షల రూపాయల వ్యవహారంలో చంద్రబాబును, నారా లోకేష్ను, ఓ ఆంధ్రప్రదేశ్ మంత్రిని ఫిక్స్ చేసే విధంగా ఎసిబి వ్యవహరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కోరుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు చెప్పాయని టైమ్స్ ఇండియా రాసింది. ఈ వార్తాకథనమే ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. చంద్రబాబు విషయం కూడా ఆలోచిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తనయ, పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అనడం కూడా చర్చనీయాంశంగా మారింది.
కేసు వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ, వార్తాకథనాలు ఎలా వచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి వ్యవహారంతో చంద్రబాబు ప్రతిష్ట దెబ్బ తిన్నదనేది వాస్తవం. రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని ఆసరా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, కాంగ్రెసు పార్టీలు చంద్రబాబుపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి పదే పదే మాట్లాడుతూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అవినీతి విషయంలో చంద్రబాబుపై ఎదురుదాడికి దిగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు తీవ్రంగా చంద్రబాబుపై ధ్వజమెత్తారు. నోటుకు ఓటు కుంభకోణం కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు నాయకుడు దేవినేని నెహ్రూ డిమాండ్ చేశారు. చంద్రబాబును అవినీతిపరుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాల నాయకులు, తెలంగాణ అధికార పార్టీ నాయకులు చిత్రీకరిస్తూ రాజకీయ సమరానికి సిద్ధపడ్డారు.
కాగా, ఒక్క వోటుకు రూ. 5 కోట్లు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారనే విషయం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. 1994లో ఎన్టీ రామారావు చేతుల్లో నుంచి టిడిపి పగ్గాలు చేపట్టిన తర్వాత చంద్రబాబు ఎదుర్కుంటున్న అతి పెద్ద సమస్య ఇదేనని వ్యాఖ్యానిస్తున్నారు.
తనకు ప్రధాన ప్రత్యర్థి అయిన వైయస్ జగన్మోహన్ రెడ్డిని అవినీతిపరుడిగా జమకడుతూ ఆరోపణలు చేసే విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు. అవినీతి విషయంలో జగన్ను ఎదుర్కోవడానికి చంద్రబాబుకు నైతిక బలం సన్నగిల్లే ఉదంతంగా రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.












Click it and Unblock the Notifications