సినిమాలకు గుడ్బై: 'అన్నయ్యను పిలవను, 2019 ఎన్నికల్లో పోటీ చేస్తా'
అమరావతి: మరో రెండు లేదా మూడు సినిమాల్లో మాత్రమే పవన్ కళ్యాణ్ నటించనున్నారా? మరో మూడేళ్లలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున ప్రత్యక్షంగా బరిలోకి దిగడానికి ఆయన రంగం సిద్ధం చేసుకున్నారా? పవన్ కళ్యాణ్ మాటలు వింటుంటే అవుననే అనిపిస్తోంది.
పవన్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలైన నేపథ్యంలో ఆదివారం ఆయన ఒక టీవీ చానెల్ తో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తానేం చేయాలో తనకు తెలుసని, దానిని సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటున్నానని ఆయన చెప్పారు.
విత్తనం వేయగానే పళ్లు, కాయలు రావని ఆయన చెప్పారు. రాజకీయాల్లో ఏం చేసినా చెప్పి చేస్తానని ఆయన తెలిపారు. ప్రజల గొంతు వినిపించాలనేదే తన తపన అని ఆయన అన్నారు. తాను విజయం సాధిస్తానా? లేదా? అన్నది తరువాత అని, ప్రయత్నలోపం లేకుండా శాయశక్తులా పోరాటం మాత్రం చేస్తానని ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం పోరాడుతానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని పేర్కొన్నారు. నెల గడవడమే కష్టంగా ఉందని, తన సిబ్బందికి జీతాలు చెల్లించాలన్నా ఇబ్బందిగా ఉన్నట్లు చెప్పారు.
అన్నయ్య చిరంజీవితో రాజకీయంగా మాత్రమే విభేదాలున్నాయని, కుటుంబపరంగా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. చిరంజీవిని జనసేన పార్టీలోకి రమ్మని ఆహ్వానించనని అన్నారు. సినిమాల్లో నటించడం ఎప్పుడు మానేస్తానో చెప్పలేనని, ఇంకా రెండు లేదా మూడు సినిమాల్లో నటించే అవకాశం ఉందని వెల్లడించారు.
సినిమాలు ఎప్పుడు మానేస్తానో కచ్చితంగా చెప్పలేనన్నారు. త్రివిక్రమ్, ఎస్ జే సూర్య దర్శకత్వంలో సినిమాలు చేస్తానని చెప్పారు. ఆయన మాటలను బట్టి ఎన్నికల నాటికి రెండుమూడు సినిమాలు పూర్తి చేసి ఎన్నికల నాటికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతారని అంచనా వేస్తున్నారు.
కాగా గతేడాది సాధారణ ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ జనసేన పేరుతో పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఓట్లు చీలుతాయన్న కారణంగానే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడంలేదని గత సాధారణ ఎన్నికలకు ముందు పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications