తిరుపతి లడ్డూల కల్తీపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పగలరా?
అత్యంత పవిత్రంగా భావించే తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నారు. తాజాగా వారు ఇరువురు ఈ వ్యవహారం పైన ఘాటుగా స్పందించారు. నేడు మద్దిరాలపాడు లోని రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గత వైసిపి ప్రభుత్వం లో తిరుమల వేదికగా పాల్పడిన దారుణాల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుమల శ్రీవారి లడ్డు కల్తీపై చంద్రబాబు ఆగ్రహం
వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలపైన చంద్రబాబు మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని కూడా జగన్ కల్తీ చేశాడని కల్తీ నెయ్యితో దేవుడికి నైవేద్యం పెట్టారని, శ్రీవారి ప్రసాదంలో ఇష్టారాజ్యంగా వాడకూడని పదార్థాలు వాడారని చంద్రబాబు మరోమారు పేర్కొన్నారు. 2019 నుంచి 2024 మధ్య పని చేసిన ముఖ్యమంత్రి జగన్ వంటి వ్యక్తిని తాము ఇంతవరకు చూడలేదు అన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.

జగన్ కు చంద్రబాబు కౌంటర్
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో స్వామి దర్శనాలు, భోజనాలు సరిగ్గా లేవని, తిరుమల శ్రీవారి విషయంలో క్షమించరాని నేరం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఎవరిని వదిలిపెట్టేది లేదని, తిరుమలలో సంపూర్ణప్రక్షాళన మొదలుపెట్టామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, టెండర్ పిలిచానని జగన్ చెబుతున్నాడని టెండర్ పిలిచిన జగన్ 320 రూపాయలకే కిలో నెయ్యి వస్తుందంటే ఆలోచించాలి కదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.
తాటతీస్తామని చంద్రబాబు వార్నింగ్
తమకు ఏమీ తెలియదని ఇప్పుడు బుకాయిస్తే ఎలా అని నిలదీస్తున్నారు. ఏ వన్, ఏ టూ నా పాలన గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్న చంద్రబాబు పాలన గురించి వీళ్లను అడిగి నేను తెలుసుకోవాలా అని ప్రశ్నించారు. వైసిపి నేతలు ఎదురు దాడి చేస్తే భయపడతామని భావిస్తున్నారని, ఎవరికీ భయపడేది లేదని, తాటతీస్తామని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
తిరుమల లడ్డూ కల్తీపై స్పందించని పవన్ కళ్యాణ్
ఇక తాజాగా మరోమారు తిరుమలలో లడ్డు వ్యవహారం పైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. స్వచ్ఛమైన నెయ్యి ధర ఎక్కువ ఉంటుందన్న ఆయన తక్కువ ధరకు వస్తుందని ఎలా కొంటారు అంటూ ప్రశ్నించారు. తిరుమల లడ్డు ప్రసాదంపైన ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయని ల్యాబ్ పరీక్షలు నిర్వహించాలని, చాలామంది ఫిర్యాదు చేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ప్రజల మనోభావాలను గౌరవించకుండా తిరుమల పవిత్రతకు భంగం
టిటిడి గత చైర్మన్ ఈవో ఈ వ్యవహారాన్ని పట్టించుకోకుండా నిమ్మకు నిరెత్తినట్టు వ్యవహరించారని విమర్శించారు. లడ్డూ కల్తీ గురించి తెలిసి కూడా పట్టించుకోలేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ గురించి తెలిసి తన దిగ్భ్రాంతికి గురయ్యానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజల మనోభావాలను గౌరవించకుండా తిరుమల ఆలయ పవిత్రతను దెబ్బతీశారని, గత ప్రభుత్వం పైన పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ప్రజల మనోభావాలతో చెలగాటమాడే ఎవరిని వదిలిపెట్టేది లేదని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications