బాలయ్య డిమాండ్ కు జగన్ సై !! చంద్రబాబు చేయలేనిది : కీలక ప్రకటన దిశగా సీఎం..!!
మరో కీలక ప్రకటన దిశగా సీఎం జగన్ సిద్దం అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అన్ని వైపులా టీడీపీ అధినేతను ఆత్మరక్షణలోకి నెట్టటమే సీఎం జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. అందులో భాగంగా.. ఏపీలో జిల్లాల పునర్విభజన అంశంలో కీలక ప్రకటనకు రంగం సిద్దమైంది.
ఇప్పటికే రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచుతూ ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. దీని పైన అనేక అభ్యంతరాలు..సూచనలు ప్రభుత్వానికి చేరాయి. వీటి పైన స్క్రూటినీ చేసిన ప్రభుత్వం తుది ప్రకటనకు సిద్దం అవుతోంది. ఇందులో భాగంగానే.. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ కొత్త జిల్లాల పైన ప్రకటన చేసేందుకు సిద్దం అయ్యారు.

బాలకృష్ణ డిమాండ్ పైనా నిర్ణయం..
ఇక, కొత్త జిల్లాల్లో మార్పులు - చేర్పుల పైన అధికార పార్టీ నేతలతో పాటుగా టీడీపీ ముఖ్యుల నుంచి సూచనలు అందాయి. అందులో భాగంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ ను జిల్లా కేంద్రంగా చేయాలంటూ సినీ నటుడు..టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆందోళనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
అసవరమైతే సీఎం ను కలుస్తానని చెప్పారు. హిందూపూర్ టీడీపీకి కంచుకోటగా ఉంది. అక్కడ సానుకూలత కోసం సీఎం జగన్ హిందూపూర్ ను జిల్లా కేంద్రం పైన అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇవ్వనున్నారు. హిందూపూర్ లో ఈ సారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగురవేయాలన్నది సీఎం లక్ష్యం.
దీంతో.. హిందూపూర్ ను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే..పుట్టపర్తి జిల్లా పరిధిలో రాజకీయంగా ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశం పైన ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. దీని పైన సానుకూల ప్రకటన వస్తుందని చెబుతున్నారు. అదే విధంగా.. చంద్రబాబు ఇలాకా అయిన కుప్పం విషయంలోనూ కీలక ప్రకటన దిశగా జగన్ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.

చంద్రబాబు నియోజవకర్గం పైనా
కుప్పం నియోజకవర్గాన్ని రెవిన్యూ డివిజన్ గా మార్చాలంటూ కుప్పంలోని టీడీపీ నేతలే ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. ఈ వ్యవహారం సీఎం వద్దకు చేరింది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన సొంత నియోజకవర్గాన్ని రెవిన్యూ డివిజన్ గా చేసుకోలేకపోయారనే విషయాన్ని చెబుతూనే..తన నియోజకవర్గాన్ని రెవిన్యూ డివిజన్ గా మార్చాలని తమ ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని జగన్ ప్రస్తావించనున్నారు.
దీనికి ఆమోద ముద్ర వేస్తూ జగన్ ప్రకటన చేయనున్నట్లు సమాచారం. జిల్లాల పేర్లు, రెవెన్యూ డివిజన్లకు సంబంధించిన అంశాలపై అత్యధికంగా ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ డివిజన్లు 51 నుంచి 63కి పెరిగాయి. ప్రజల నుంచి అందుతున్న అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల ప్రకారం డివిజన్ల సంఖ్య 70 నుంచి 73 వరకు పెరిగే అవకాశం ఉంది.
అందులో కుప్పంతో పాటుగా టీడీపీ కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఉన్నాయని సమాచారం. అసెంబ్లీలో జిల్లాల పునర్విభజనపై చర్చించడం ద్వారా ప్రభుత్వానికి మైలేజ్ పెరుగుతుందని అధికారపార్టీ అంచనా వేస్తోంది.

ఎన్టీఆర్ పేరు..ఇరకాటంలో టీడీపీ
ఇక, విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పైన కొన్ని అభ్యంతరాలు...సూచనలు వచ్చాయి. దీని పైన సభలో టీడీపీ అభిప్రాయం చెప్పాలని వైసీపీ డిమాండ్ చేసే అవకాశం ఉంది. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
దీని ద్వారా అటు ఎన్టీఆర్ అభిమానులు.. బాలయ్య డిమాండ్ నెరవేర్చటం ద్వారా టీడీపీ కార్యకర్తలు... కుప్పంను రెవిన్యూ డివిజన్ గా ప్రకటించటం ద్వారా చంద్రబాబు పైన రాజకీయంగా పై చేయి సాధించే ప్రయత్నం జగన్ చేస్తున్నారు. విజన్ ఉన్న నాయకుడిగా చెప్పుకొనే చంద్రబాబు చేయలేని నిర్ణయాలు తాము చేస్తున్నామని జగన్ చెప్పేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.

రాజకీయంగా జగన్ పై చేయి సాధించేలా
ఇక, సొంత పార్టీ నేతల నుంచే పలు జిల్లాల్లో మండలాలను ఏయే డివిజన్లలో కలపాలనే అంశంపై వచ్చిన వినతుల్లో ఒకటి రెండు మార్పులు చేసే అవకాశం ఉందని సమాచారం. నగరి ఎమ్మెల్యే రోజా..ఆనం రామనారాయణ రెడ్డి.. ప్రకాశం జిల్లా నేతలు కొన్ని వినతులను ప్రభుత్వం ముందు ఉంచారు. వీటి పైన సభా వేదికగా సీఎం స్పష్టత ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగుల విభజన , ఫర్నీచర్ కేటాయింపులు పూర్తి చేసింది. దీంతో..రాజకీయంగా జిల్లాల పునర్విభజన అంశంలో పై చేయి సాధించేలా వ్యూహాత్మక నిర్ణయాలతో ప్రకటనకు సీఎం సిద్దం అవుతున్నారు. మరి.. రాజకీయంగా ఈ నిర్ణయాలు జగన్ కు ఎంత వరకు కలిసి వస్తాయనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications