జగన్ మానసపుత్రిక కొనసాగేనా ?-హైకోర్టు తీర్పుతో టర్నింగ్- పంచాయతీకి చెక్ ఎప్పుడో ?
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల వద్దకు సంక్షేమ పథకాల్ని మరింత మెరుగ్గా తీసుకెళ్లేందుకు వీలుగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధను ఏర్పాటు చేశారు. దీంతో ప్రతీ 2 వేల ఇళ్లకో సచివాలయం చొప్పున, 50 ఇళ్లకో వాలంటీర్ చొప్పున ఏర్పాటు చేశారు. అయితే వార్డు సచివాలయాలతో ఇబ్బంది లేకపోయినా, గ్రామ సచివాలయాలు మాత్రం పంచాయతీ రాజ్ వ్యవస్ధ ఉనికకి ముప్పుగా మారాయి. ముఖ్యంగా సర్పంచ్ లు, గ్రామకార్యదర్శుల హవా సాగే పంచాయతీల్లో సచివాలయాల రాకతో పరిస్ధితి మారిపోయింది. ఈ నేపథ్యంలో హైకోర్టు నిన్న ఇచ్చిన తీర్పు ఓ టర్నింగ్ పాయింటా్ ఇచ్చింది.
జీవో నంబర్ 2ను సస్పెండ్ చేసిన హైకోర్టు
ఏపీలో గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకూ సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శులు చెలాయిస్తున్న అధికారాల్లో కొన్నింటిని వీఆర్వోలకు బదిలీ చేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 2ను హైకోర్టు నిన్న కొట్టేసింది. రెవెన్యూ వ్యవస్ధలో భాగమైన గ్రామ సచివాలయాల్లో వీఆర్వోలకు ఇచ్చిన అధికారాలు పంచాయతీ సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శులకు చెక్ పెట్టేలా ఉన్నాయని హైకోర్టు భావించింది. దీంతో ఈ జీవోను కొట్టేసింది. అయితే ఈ వ్యవహారం ఇంతటితో ముగిసిపోలేదు.
సమాంతర వ్యవస్ధ ఎందుకన్న హైకోర్టు
ఇదే పిటిషన్ పై గత విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని కీలక ప్రశ్నలు వేసింది. పంచాయతీరాజ్ వ్యవస్ధలో భాగంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలు ఉండగా.. గ్రామ సచివాలయాల పేరుతో సమాంతర వ్యవస్ధ ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా పంచాయతీల అధికారాలకు, ఉనికికి ముప్పు కలగదా అని ప్రశ్నించింది. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు కోసమని బదులివ్వగా.... ఆ పని పంచాయతీల ద్వారానే చేయొచ్చు కదా అని హైకోర్టు సూచించింది. తాజాగా గ్రామ పంచాయతీల అధికారాల్లో కొన్నింటిని సచివాలయాల్లో ఉండే వీఆర్వోలకు బదిలీ చేయడాన్ని కోర్టు కొట్టేసింది. దీంతో సమాంతర వ్యవస్ధగా ఉన్న గ్రామ సచివాలయాల వ్యవస్ధపై హైకోర్టు తుది తీర్పులో ఏం చెప్పబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.
జగన్ మానస పుత్రికకు చెక్ పడుతుందా ?
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మానసపుత్రికగా గ్రామ సచివాలయాలు తెరపైకి వచ్చాయి. మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ఏర్పాటు చేసిన ఈ సచివాలయాల ద్వారా ప్రభుత్వం సంక్షేమ పథకాల్ని మరింత మెరుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న గ్రామ పంచాయతీల్ని కాదని గ్రామ సచివాలయాల్ని ప్రోత్సహించడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందాలన్నది వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. కానీ హైకోర్టు మాత్రం దీన్నో సమాంతర వ్యవస్దగా భావిస్తోంది. దీంతో గ్రామ సచివాలయాల విషయంలో త్వరలో హైకోర్టు నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.
సమాంతర వ్యవస్ధతో రెవెన్యూ, పంచాయతీ వార్
ఏపీలో పంచాయతీలు ఉండగా.. గ్రామ సచివాలయాల ఏర్పాటు సమాంతర వ్యవస్ధ వంటిదేనని హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం వీటి ఏర్పాటును సమర్ధించుకుంటోంది. రాష్టానికి సచివాలయం ఎలాంటిదో గ్రామానికి కూడా సచివాలయం అలాంటిదేనని పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి తాజాగా వ్యాఖ్యానించారు. వీఆర్వోలకు అధికారాల బదిలీకి ఇచ్చిన జీవో నంబర్ 2ను హైకోర్టు కొట్టేసినా సవరణలతో మరో జీవో ఇస్తామని ప్రకటించారు. దీంతో సచివాలయాల్ని తప్పనిసరిగా కొనసాగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అదే జరిగితే అధికారాల విషయంలో రెవెన్యూ, పంచాయతీరాజ్ మధ్య వార్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.