నాగబాబుపై అనర్హత వేటు పడుతుందా ? రాజ్యాంగం ఏం చెబుతోంది ?
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ .. తన సోదరుడు నాగబాబుకు (Naga Babu) సైతం మంత్రి పదవి ఇప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఓ దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా నాగబాబును తన కేబినెట్లోకి తీసుకోబోతున్నట్లు ఓ నోట్ కూడా విడుదల చేశారు. అనంతరం నాగబాబును ఎమ్మెల్సీ కూడా చేశారు. కానీ మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాలేదు. రాజ్యసభకు పంపుదామన్నా కుదరలేదు. దీంతో చేసేది లేక పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబును తన పర్యావరణశాఖ పరిధిలో ఉన్న ఏపీ గ్రీన్ కు ఛైర్మన్ గా నియమించారు. కేబినెట్ హోదాతో పాటు 4.5 లక్షల జీతం కూడా ఫిక్స్ చేశారు. అయితే ఇదే ఇప్పుడు ఆయనకు ఇబ్బందిగా మారబోతున్నట్లు తెలుస్తోంది.
చట్టసభల్లో సభ్యులుగా ఉన్న వారు మరే లాభదాయక పదవుల్లో ఉండకూడదని రాజ్యాంగ నిబంధనలు చెబుతున్నాయి. ఆర్టికల్ 191(1) ప్రకారం చట్ట సభ సభ్యులుగా ఉంటూ కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వంలో ఏ లాభదాయక పదవిలో ఉండకూడదని చెబుతోంది. గతంలో ఇదే నిబంధన ప్రకారం ఎంపీ జయాబచ్చన్ పై సైతం వేటు పడింది. ఇప్పుడు నాగబాబుకు కూడా అదే నిబంధన వర్తిస్తుందా అన్న చర్చ జరుగుతోంది.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ఏపీ గ్రీన్ కు ఛైర్మన్ గా నియమితులైన నాగబాబుకు కేబినెట్ హోదాతో పాటు నెలకు 4.5 లక్షల జీతం, ఇతర భత్యాలు కల్పిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆయన లాభదాయక పదవిలో ఉన్నట్లు అయింది. ఓవైపు ఎమ్మెల్సీగా జీతం తీసుకుంటూ, మరోవైపు ఏపీ గ్రీన్ ఛైర్మన్ గా జీతం తీసుకోవడం లాభదాయక పదవుల పరిధిలోకి వస్తుందని తెలుస్తోంది. దీని ప్రకారం ఎవరైనా ఫిర్యాదు చేయాలా లేక మండలి ఛైర్మన్ నేరుగా చర్యలు తీసుకోవచ్చా అన్న దానిపై చర్చ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వ వర్గాలు మాత్రం నోరుమెదపడం లేదు.













Click it and Unblock the Notifications
