షాకిస్తున్న కేసీఆర్! తెరాసలోకి ముథోల్ ఎమ్మెల్యే, క్యూ
హైదరాబాద్: తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి దూకుడును కాంగ్రెసు, టీడీపీ సహా ఇతర పార్టీలు తట్టుకోలేకపోతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. తెరాస అధికార పార్టీ అయినందున ప్రజా సమస్యల పైన దానిని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు విఫలయత్నం చేస్తున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్తో పలు వివాదాల నేపథ్యంలో అది ప్రభుత్వానికే ఉపయోగపడుతోందని అంటున్నారు.
అంతేకాకుండా, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దూకుడు ప్రదర్శిస్తున్నారు. సీఎంగా కరీంనగర్కు తొలిసారి వచ్చిన కేసీఆర్... కరీంనగర్కు, తెలంగాణకు వరాల జల్లు కురిపించారు.
కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాదులను అంతర్జాతీయ నగరాలుగా మారుస్తానని చెప్పారు. పాలమూరులో రూ.500 కోట్లతో సోలార్ పవర్ ప్రాజెక్టు చేపడతామని, ఇందుకోసం త్వరలో నిధులు విడుదల చేస్తామన్నారు. కరీంనగర్ పైన వరాలు కురిపించారు. మానేరు గార్డెన్ను బృందావనంగా మార్చుతానని చెప్పారు.
తెరాస గూటికి కాంగ్రెస్ ఎమ్మెల్యే!
అభివృద్ధి, ఇచ్చిన హామీల అమలుతో కేసీఆర్ దూసుకు పోతుంటే.. ఆ పార్టీ వైపు విపక్షాల నుండి ఆకర్షితులు అవుతున్నారు. అదిలాబాద్ జిల్లా సీనియర్ కాంగ్రెసు పార్టీ నేత, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారట. ఆయన బుధవారం కేసీఆర్ సమక్షంలో తెరాస పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారట.
ఇప్పటికే తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ముగ్గురు ఉన్నారు. వారు ఖమ్మం జిల్లాకు చెందిన వారు. వారు తెరాసలోకి వెళ్తారని ఎప్పటి నుండో ప్రచారం సాగుతోంది. అంతలోనే ఆ పార్టీ సీనియర్ నేతలు విజయా రెడ్డి, గట్టు రామచంద్ర రావు, జనక్ ప్రసాద్లు కేసీఆర్ను కలిశారు. మరోవైపు, టీడీపీ, కాంగ్రెసు పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు తెరాస తీర్థం పుచ్చుకునే అవకాశాలు కొట్టిపారేయలేమంటున్నారు.