Analysis: పిఠాపురం లెక్క మారుతోందా ? నాగబాబు ఎంట్రీతో ఎవరికి మేలు ?
ఏపీలో గత ఎన్నికల నుంచీ తరచూ వార్తల్లో నిలుస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి. ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించుకున్న దగ్గరి నుంచి మొదలైన ఈ పరంపర ఇప్పుడు ఎమ్మెల్సీగా మారాక తొలిసారి నాగబాబు చేస్తున్న పర్యటనతో పతాక స్థాయికి చేరింది. దీనికి ప్రధాన కారణం అక్కడ టీడీపీ టికెట్ ఆశించి ఎమ్మెల్సీ హామీతో సర్దుకుని, ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా మారిన మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మే. దీంతో ఇప్పుడు పిఠాపురం రాజకీయం మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
పిఠాపురం నియోజకవర్గంలో తన సామాజిక వర్గ జనాభా ఎక్కువగా లేకపోయినా ప్రజా బలంతో రాజకీయాలు చేస్తూ వస్తున్న టీడీపీ నేత వర్మ గతేడాది ఎన్నికల్లో కచ్చితంగా తనకు టికెట్ వస్తుందని ఆశించి పని చేసుకుంటూ పోయారు. కానీ చివరి నిమిషంలో సామాజిక వర్గ లెక్కలతో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎంట్రీతో వర్మ ఆశలు అడియాశలయ్యాయి. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన ఎమ్మెల్సీ సీటు హామీతో వెనక్కి తగ్గిన వర్మకు ఎన్నికల తర్వాత అదీ దక్కలేదు.

ఎమ్మెల్సీ టికెట్ కోసం ఎదురుచూపులు ఫలించక అసంతృప్తిగా ఉన్న వర్మకు మరోవైపు జనసేన నాయకుల నుంచి ఛీత్కారాలు పెరిగిపోయాయి. పిఠాపురంలో వర్మకు ఏ పదవి ఇచ్చినా అది అంతిమంగా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ కు ఇబ్బంది అన్న లెక్కలతో వారు ఆయన్ను దూరం పెట్టడం ప్రారంభించారు. దీంతో వర్మలో ఆక్రోశం రెట్టింపయింది. దీంతో వర్మ క్రమంగా తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కడం మొదలుపెట్టేశారు. పవన్ కోసమే తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం లేదని గ్రహించిన వర్మ జనసేనను టీడీపీ సాయంతో టార్గెట్ చేయడం ప్రారంభించారు.
దీంతో తాజాగా పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ వేడుకల్లో జనసేన నేత నాగబాబు పవన్ విజయంలో ప్రజలే కారణమని, ఇంకెవరైనా ఉన్నారనుకుంటే వారి కర్మ అంటూ వ్యాఖ్యానించి వర్మ గాయంపై కారం చల్లారు. దీంతో మరింత అసంతృప్తిగా ఉన్న వర్మ వైసీపీతో టచ్ లోకి వెళ్లారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఆ విషయంపై కూటమి పార్టీలు ఎక్కడా స్పందించకపోయినా.. వర్మపై దాడి మాత్రం క్రమంగా పెంచేస్తున్నారు. అయితే పవన్ ఈ వ్యవహారాన్ని లైట్ తీసుకోవడం లేదని తెలుస్తోంది.

వర్మను ఇలాగే వదిలేస్తే వచ్చే ఎన్నికల నాటికి పిఠాపురంలో తాను మళ్లీ గెలవడం కష్టమనే అంచనాకు వచ్చేసిన పవన్ .. ఆయన సోదరుడు నాగబాబును అక్కడ రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. నాగబాబును గతంలో తాను శంఖుస్దాపన చేసిన కార్యక్రమాల ప్రారంభోత్సవానికి పంపడం ద్వారా స్థానికంగా పట్టు పెంచుకునేలా పవన్ ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నాగబాబు రెండు రోజులుగా పిఠాపురంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
దీంతో అసలే అసంతృప్తిగా ఉన్న వర్మ.. వ్యక్తిగత కారణాలు చూపుతూ నాగబాబు పర్యటనకు దూరంగా ఉండిపోయారు. అదే సమయంలో టీడీపీ శ్రేణులు వర్మకు మద్దతుగా నాగబాబు పర్యటనలో గో బ్యాక్ నాగబాబు నినాదాలు చేస్తూ చికాకు పెడుతున్నారు. అయితే ఇదంతా చూస్తున్న టీడీపీ అధిష్టానం ఎందుకు మౌనంగా ఉంటుందన్న చర్చ ఇప్పుడు మొదలైంది. దీంతో అధిష్టానం ఆశీస్సులతోనే వర్మ అనుచరులు ఇలా నాగబాబు టూర్ లో ఆయన్ను చికాకు పెడుతున్నట్లు అర్దమవుతోంది. తద్వారా వర్మ తమ పార్టీ వీడకుండా టీడీపీ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు నాగబాబును రంగంలోకి దించడం ద్వారా పిఠాపురంలో సొంత బలం సుస్దిరం చేసుకునేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తుంటే ఇది వర్మకు పుండుమీద కారం చల్లినట్లు మారుతోంది. దీంతో ఇప్పుడు నాగబాబు టూర్ పవన్ కు ఉపయోగపడుతుందా లేక వర్మకు ఉపయోగపడబోతోందా అన్న చర్చ స్థానికంగా మొదలైంది. ఎందుకంటే ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న వర్మ.. ఇప్పుడు నాగబాబు టూర్ తో తన అనుచరుల్ని ఆయన వద్దకు పంపి నినాదాలు చేయిస్తున్నారు. ఇదంతా చూస్తున్న టీడీపీ అధిష్టానం సైలెంట్ గా ఉంటోంది.
పిఠాపురంలో ఇదే పరిస్ధితి కొనసాగితే భవిష్యత్తులో వర్మకు మద్దతుగా టీడీపీ నోరు విప్పితే అది పవన్ కు పిఠాపురంలో రాజకీయంగా నష్ఠం కలిగించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. కాబట్టి పవన్ ఎత్తు ఫలిస్తుందా చిత్తవుతుందా అనేది కాలమే తేలాల్చి ఉంది. ఇప్పటికే పిఠాపురంలో పవన్ పై ఆశలు సన్నగిల్లుతున్నాయన్న చర్చ మొదలైంది. స్థానికంగా ఉండే నేతల్ని కాదని పవన్ ను గెలిపించుకుంటే ఇప్పుడు ఆయన దూరంగా ఉండిపోతుండటం స్థానికుల్ని కలవరపెడుతోంది. పైకి ఎన్ని చెప్తున్నా పవన్ లోనూ టెన్షన్ మొదలైందన్న చర్చ జరుగుతోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications