వైజాగ్ లో వైసీపీకి రాజధాని మైలేజ్ దొరికిందా ? చిరంజీవి సవాల్ -సెమీఫైనల్ గా ఎమ్మెల్సీ పోరు !
ఏపీలో మూడు రాజధానుల పోరుతో వైజాగ్ లో రాజకీయ లెక్కలు మారిపోయినట్లు భావిస్తున్న తరుణంలో అక్కడ వచ్చే ఎన్నికల్లో గెలుపు అవకాశాల్ని తేల్చేందుకు ఎమ్మెల్సీ పోరు ఉపయోగపడబోతోంది.
ఏపీలో మూడు రాజధానులు తెరపైకి రాకముందు రాష్ట్రమంతా వీచిన వైసీపీ గాలుల్ని తట్టుకుని టీడీపీ వైజాగ్ లో నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెల్చుకుంది. తద్వారా వైజాగ్ నగరంపై తమకున్న పట్టు నిరూపించుకుంది. అలాగే మూడు రాజధానులపై అడుగులు పడటం మొదలయ్యాక అక్కడ స్ధానిక సంస్ధల ఎన్నికల్నీ గెల్చుకుంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా స్ధానిక పోరులో వైసీపీ గాలి వీయడంతో ఈ ఫలితాలకు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు వైజాగ్ లో ఏ పార్టీ ఆధిక్యంలో ఉందో తేల్చేందుకు మరో పోరు జరగబోతోంది.

వైజాగ్ పాలిటిక్స్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రక్రియ మొదలుపెట్టకముందు, అమరావతిని రాజధానిగా కొనసాగుతున్న సమయంలోనే వైజాగ్ ఓటర్లు టీడీపీకి పట్టం కట్టారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి బలంగా వీచినా వైజాగ్ లో మాత్రం టీడీపీ హవా కనిపించింది. దీంతో ఇక్కడ టీడీపీకి ఉన్న పట్టు మరోసారి అర్ధమైంది. అయితే మూడు రాజధానులు తెరపైకి వచ్చాక టీడీపీ పరిస్దితి ఇక్కడ దారుణంగా తయారైందని, వైసీపీ హవా మొదలైందనే ప్రచారం సాగుతోంది. దీన్ని త్వరలో జరిగే ఎమ్మెల్సీ పోరు ఫలితాలు తేల్చబోతున్నాయి.

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పోరు
మార్చిలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది. ప్రస్తుతం ఈ స్ధానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా బీజేపీకి చెందిన పీవీఎన్ మాధవ్ ఉన్నారు. ఆయన స్ధానంలో ఎన్నికయ్యేందుకు వైసీపీ సీతంరాజు సుధాకర్ ను , టీడీపీ చిరంజీవిరావును బరిలోకి దింపింది. అయితే ఎమ్మెల్సీ పోరుకు చాలాకాలం ముందే వైసీపీ ఇక్కడ బీజేపీతో పోరు టార్గెట్ గా మాధవ్ ప్రత్యర్ధిగా సీతంరాజును ఎంచుకుంది. అయితే టీడీపీ కూడా మరో అభ్యర్దివైపు చూసింది. చివరికి కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని రావును ఎంచుకుంది. దీంతో వైసీపీపై ఇప్పుడు టీడీపీ పైచేయి కనిపిస్తోంది.

ఎమ్మెల్సీ పోరులో వైసీపీ వర్సెస్ టీడీపీ
ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలో దాదాపు 1.8 లక్షల ఓట్లుంటే కేవలం వైజాగ్ లోనే 1.5 లక్షల ఓట్లున్నాయి. దీంతో ఈ ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నిక కాస్తా వైజాగ్ పట్ఠభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికగా మారిపోయింది. వైజాగ్ పరిధిలోకి వచ్చే పట్టభద్రుల ఓటర్లే ఇందులో కీలకం కానున్నారు. అందులోనూ పట్టభద్రుల పోరులో టీచర్ల ఓట్లు మరింత కీలకంగా మారుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత నేపథ్యంలో టీడీపీ.. టీచర్లలో పట్టున్న చిరంజీవిరావును దింపింది. తద్వారా ముందే పైచేయి సాధించిందన్న ప్రచారం సాగుతోంది. కానీ అధికారంలో ఉన్న వైసీపీ కూడా అంతే దీటుగా సీతంరాజుకు అనుకూలంగా పావులు కదుపుతోంది. దీంతో ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారిపోయింది.

వైజాగ్ తీర్పు తేల్చే సెమీఫైనల్ ?
వైజాగ్ లో మూడు రాజధానుల ప్రకటన తర్వాత స్ధానిక సంస్ధల ఎన్నికలు జరిగినా వైసీపీకి అనుకూలంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాజిటివ్ ఓటు ప్రభావం ఇక్కడా కనిపించింది. దీంతో వైజాగ్ పల్స్ ప్రత్యేకంగా తేలలేదు. కానీ ఇప్పుడు పరిస్దితులు మారాయి. దీంతో వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన ఇలా ప్రతీ పార్టీకి వైజాగ్ లో తాజాగా ఉన్న పట్టెంత అనే అంశాన్ని ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు తేల్చబోతోంది. అంతే కాదు వచ్చే ఎన్నికల్లో వైజాగ్ లో గెలిచేదెవరన్న దాన్నీ ఈ పోరు ముందుగా తేల్చబోతోంది. దీంతో ఈ వైజాగ్ తీర్పు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా పార్టీలు సైతం భావిస్తున్నాయి.












Click it and Unblock the Notifications