Pawan Kalyan: కాకినాడ సిటీలో పవన్ పోటీ ఖాయమైందా ? కీలక సంకేతాలు.!
ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టీడీపీ, బీజేపీ వంటి పార్టీల్ని కలుపుకుని బలమైన కూటమిని ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో పాటు తాను పోటీ చేసే సీటుపై కూడా పలు నియోజకవర్గాల్ని ఆయన పరిశీలిస్తున్నారు. ఈ మధ్య లీకైన ఓ నివేదికలో ఏకంగా ఆరు సీట్లను ఇందుకోసం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే వీటిలో కాకినాడ సిటీ సీటును ఆయన ప్రత్యేకంగా భావిస్తున్నారు.
కాకినాడతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గాలపై సమీక్ష కోసం నిన్నటి నుంచి నగరంలో మకాం వేసిన పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీకి చెందిన పలువురు నేతల్ని పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కాకినాడ సిటీకి సంబంధించి పవన్ కళ్యాణ్ జరుపుతున్న సమీక్షలో ఓ కీలకాంశం బయటికి వస్తోంది. ఈసారి ఎన్నికల్లో కాకినాడ సిటీ నుంచి తాను పోటీ చేస్తే పరిస్దితి ఎలా ఉండబోతోందన్న అంశంపై పవన్ సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

కాకినాడ నగరపాలకసంస్ధ పరిధిలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. వీటిలో జనసేన పార్టీకి అంత బలం లేదు. అయితే సొంత సామాజిక వర్గం నేతలకు మాత్రం కొదవలేదు. ఈ నేపథ్యంలో ఎలాగో టీడీపీ మద్దతు ఉంటుంది కాబట్టి ఈసారి కాకినాడ సిటీ సీటు నుంచి పోటీ చేస్తే ఫలితం ఎలా ఉండొచ్చన్న అంశపై పవన్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే డివిజన్లలో కమిటీలు వేయడం కానీ, ఇతర ఏర్పాట్లు కానీ చేయడంలో స్ధానిక జనసేన నేతల వైఫల్యం పవన్ ను కలవరపెడుతోంది.
ఈ నేపథ్యంలో ఇవాళ కూడా కాకినాడ సిటీ సీటుపై చర్చలు జరిపి పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇప్పటికే కాకినాడ సిటీలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పవన్ టార్గెట్ చేశారు. గతంలో తనపై ఆయన చేసిన విమర్శలతో పాటు నగరంలో జనసేన శ్రేణులపై వైసీపీ కార్యకర్తలతో దాడులు చేయించడం వంటి పరిణామాలతో పవన్ ఈ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications