బందరుపై పవన్ భారీ ప్లాన్ ? జనసేనలోకి రాధాను రప్పించి ! ఆ ఏడు సీట్లలో ప్రభావం ?
ప్రస్తుతం టీడీపీలో ఉన్న వంగవీటి రాధాను వచ్చే ఎన్నికల్లో జనసేనలోకి చేర్చుకుని బందరు ఎంపీగా పోటీ చేయించేందుకు పవన్ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకేంగా విపక్షాలను కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. త్వరలో జరిగే తన పార్టీ ఆవిర్భావ సభను కూడా ఇందుకు వాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా బందరులో ఏరికోరి ఆవిర్భావ సభ ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ రాజకీయ సమీకరణాలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా బందరులో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న పోరు, టీడీపీ ఎంపీ అభ్యర్ధి లేకపోవడం వంటి కారణాలతో వంగవీటి రాధాను బరిలోకి దింపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

బందరులో జనసేన సభ
బందరులో ఈ నెల 14న జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ జరగబోతోంది. ఈ సభ ద్వారా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పలు రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్నారు. అందుకే బందరును ఏరికోరి మరీ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తనపై నిత్యం రాజకీయ దాడి చేస్తున్న బందరు ఎమ్మెల్యే పేర్నినానితో పాటు, ఆయన ప్రత్యర్ధి, ఎంపీ బాలశౌరిని కూడా వచ్చే ఎన్నికల్లో దెబ్బతీసేందుకు తగిన వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీవైపు తొలిసారి మొగ్గిన బీసీలతో పాటు, కాపుల మద్దతుతో గెలిచిన పేర్నినానికీ, బాలశౌరికీ ఒకేసారి చెక్ పెట్టేందుకు పవన్ వ్యూహరచన చేస్తున్నారు.

జనసేనలోకి రాధాకు ఆహ్వానం
ప్రస్తుతం టీడీపీలో ఉన్న వంగవీటి రంగా వారసుడు రాధాకృష్ణకు మరోసారి ఎమ్మెల్యే సీటు లభించడం కష్టంగానే ఉంది. కానీ జనసేనలోకి వస్తే మాత్రం ఎమ్మెల్యే అయినా, ఎంపీ సీటు అయినా సునాయాసంగా దొరుకుతుంది. గత ఎన్నికల్లో చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన రాధాను చంద్రబాబు కేవలం ప్రచారానికే పరిమితం చేశారు. అప్పటికప్పుడు పోటీ చేసినా్ గెలిచే అవకాశం లేకపోవడంతో కేవలం ప్రచారానికే వాడుకున్నారు. కానీ ఈ నాలుగేళ్లలో రాధా ఏ నియోజకవర్గంపైనా ఫోకస్ పెట్టకుండా కాపు సామాజిక వర్గంతో మమేకం అయ్యేందుకే ప్రయత్నించారు. ఇప్పుడు ఆయన్ను జనసేనలోకి తీసుకురావడం ద్వారా బందరులో పోటీ చేయించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది.

బందరులో రాధాకు గ్రౌండ్ ప్రిపేర్ ?
బందరులో ఎంపీగా పోటీచేసేందుకు గతంలో వైసీపీ కూడా వంగవీటి రాధాకు ఆఫర్ ఇచ్చింది. కానీ ఆయన పోటీ చేయలేదు. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లి ఎక్కడా పోటీ చేయలేదు. ఇప్పుడు తిరిగి బందరు ఎంపీ సీటును ఆఫర్ చేస్తూ రాధాను జనసేనలోకి తెచ్చేందుకు పవన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అంతకుముందే బందరులో సమీకరణాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పవన్ సిద్ధమయ్యారు. బందరులో జనసేన ఆవిర్భావ సభ ఏర్పాటుతో పాటు స్ధానికంగా రాధాను పోటీ చేయిస్తామన్న సంకేతాలు ఇవ్వడం ద్వారా ఆయనకు స్ధానికంగా సానుకూలత తెప్పించేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

బందరులో పవన్ ప్లాన్ ఇదే ?
వచ్చే ఎన్నికల్లో బందరు ఎమ్మెల్యే సీటు నుంచి టీడీపీ అభ్యర్ధిగా మరోసారి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోటీ చేసే అవకాశముంది. అయితే ఎంపీ అభ్యర్ధిగా కొనకళ్ల నారాయణ పోటీ చేయట్లేదు. ఆయన పెడన నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగబోతున్నారు. దీంతో టీడీపీకి ఎంపీ అభ్యర్ది లేరు. అదే సమయంలో బందరు ఎంపీ సీటు పరిధిలో కాపు సామాజిక వర్గ జనాభా ఎక్కువగానే ఉంది. దీంతో బందరుతో పాటు గుడివాడ, గన్నవరం, పెనమలూరు, పెడన, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాలపై ప్రభావం చూపేలా రాధాను బందరు ఎంపీగా బరిలోకి దింపబోతున్నట్లు తెలుస్తోంది. పేర్నినాని, బాలశౌరికి చెక్, రాధాకు గ్రౌండ్ ప్రిపేర్ చేయడంలో భాగంగానే జనసేన ఆవిర్బావ సభను బందరులో ఏర్పాటు చేసినట్లు సమాచారం












Click it and Unblock the Notifications