టీ బిల్లుపై ఉత్కంఠ: రాష్ట్రపతి గడువు పెంచుతారా?
న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గడువు పెంచుతారా, లేదా అనే ఉత్కంఠ నెలకొని ఉంది. రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల నేతలే కాకుండా ఇరు ప్రాంతాల ప్రజలు కూడా రాష్ట్రపతి నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చకు రాష్ట్రపతి ఈ నెల 23వ తేదీ వరకు గడువు ఇచ్చారు. దాన్ని మరో నలబై రోజుల పాటు పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రపతికి లేఖ రాశారు.
రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖలు పంపిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి మహంతి ఢిల్లీలోనే మకాం వేశారు. మహంతి కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఆ తర్వాత కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామితో పాటు ఇతర అధికారులను కూడా కలిశారు. ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్ను కూడా కలిసే అవకాశం ఉంది.
చర్చకు గడువు పెంచాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేయాలని శాసనసభా వ్యవహారాల మంత్రి శైలజానాథ్ మంగళవారం సభలో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు సీమాంధ్ర సభ్యుల నుంచి మద్దతు లభించింది. అయితే, తెలంగాణ సభ్యులు మాత్రం దాన్ని వ్యతిరేకించారు. బిజెపి సభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి, తెలుగుదేశం సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ గడువులోగా బిల్లుపై శాసనసభ అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపించాలని కోరారు .
ఇదిలా వుంటే, ప్రధాని మన్మోహన్ సింగ్తో హోం మంత్రి షిండే భేటీ అయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ధర్నాపైనే కాకుండా తెలంగాణ బిల్లుపై కూడా వారు చర్చించినట్లు సమాచారం. ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు.
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రతిపాదించకుండా చూడాలనే వ్యూహంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు వారాల గడువు కోరుతున్నారనేది బహిరంగమైన విషయమే. ఫిబ్రవరి 21వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. అందుకు అనుగుణంగా శాసనసభ నుంచి శాసనసభ నుంచి బిల్లు రావాల్సి ఉంటుంది.
తెలంగాణ ముసాయిదా బిల్లుపై గడువు పెంచకూడదని తెలంగాణ కాంగ్రెసు నేతలు రాష్ట్రపతిని కోరారు. కాగా, మరో 45 రోజులు గడువు ఇవ్వాలని తెలుగుదేశం సీమాంధ్ర నేతలు కోరబోతున్నట్లు సమాచారం. ఈ స్థితిలో రాష్ట్రపతి నిర్ణయం బుధవారం వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి వారం లేదా పది రోజుల గడువు పొడగించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. మొదటి విడత వారం రోజులు, ఆ తర్వాత మరో వారం రోజులు కూడా ఇచ్చే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తోంది.