అధికారంలోకి రావడంతోపాటు ఏపీని పునర్నిర్మించాలి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్/అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. 'నేను.. తెలుగుదేశం' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు తోపాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, టీడీపీ సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
మళ్లీ అధికారంలోకి రావాలి, ఏపీని పునర్నిర్మించాలి: చంద్రబాబు
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో మళ్ళీ అధికారంలోకి రావడమే కాదు.. రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ తరుపున లాభాలు పొందిన వ్యక్తి సీపీఐ నారాయణ అని, నన్ను ఎప్పుడూ విమర్శించారు.. ఇప్పుడు అర్థం చేసుకున్నారని అన్నారు. తాను ప్రతి విమర్శ చేయలేకుండా సద్విమర్శగా తీసుకున్నానన్నారు. ప్రజల మేలు కోసం తాము పని చేస్తామని, సీపీఐ నారాయణ సిద్ధాంతాల కోసం పని చేస్తారన్నారు.
రాజకీయాన్ని వ్యాపారం చేస్తే అవినీతి..: చంద్రబాబు
చిత్తశుద్ధితో ఉన్న కార్యకర్త, ఒకే వ్యక్తి ఒకే పార్టీ కంభంపాటి రాంమోహన్ అని, చాలా మంది దగ్గర ఉంటే శత్రువులు అవుతారు కానీ... కంభంపాటి అలా కాదని చంద్రబాబు అన్నారు. కంభంపాటి రాంమోహన్ ఎన్నో పదవులు నిర్వహించారని, ప్రతీ ఒక్కరికి ఒక వ్యాపారమో, ఇల్లు గడిచే విధంగా ఉంటే బాగుంటుందని నేను ఎప్పుడూ చెబుతానన్నారు. రాజకీయాన్ని వ్యాపారం చేసుకుంటే అవినీతి జరుగుతుందన్నారు. రేపు 40 సంవత్సరాల పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జరుపుకుంటామన్నారు. ఎన్టీఆర్ 100 సంవత్సరాల జయంతి వేడుకలు రాబోయే సంవత్సరంలో ఉంటుందన్నారు చంద్రబాబు. రాజకీయాల్లో వస్తే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని నేను చెప్పా... అప్పుడు ఎన్టీఆర్ రాజకీయాలకే ఓటు వేశారని, రెండు రూపాయలకు కిలో బియ్యం ఆహార భద్రతకు దారి తీసిందన్నారు చంద్రబాబు.
చంద్రబాబుపై కంభంపాటి రామ్మోహన్ ప్రశంసలు
కాగా, టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు రచించిన 'నేను-తెలుగుదేశం' అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం హైదరాబాదులో జరిగింది. 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని ఈ పుస్తకంలో వివరించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, సహా ప్రముఖులు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తన పుస్తకంపై కంభంపాటి రామ్మోహన్ రావు స్పందిస్తూ... ఈ పుస్తకం కోసం రెండేళ్లు హోమ్ వర్క్ చేశానని వెల్లడించారు. 'ఎన్టీఆర్ ఏది చెబితే అది చేయడమే నాకు తెలుసు' అని వివరించారు కంభంపాటి. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని ప్రశంసించారు. చంద్రబాబు తన హయాంలో హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని వ్యాఖ్యానించారు.