డిఎస్ భేటీ: తెలంగాణపై ఏదైనా సోనియా గాంధీయే?
శుక్రవారం జరిగే కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తాజా పరిస్థితులు సమీక్షించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర నేతల వాదనలు విన్న కేంద్ర మంత్రి ఆంటోనీ శుక్రవారం సోనియాగాంధీకి పరిస్థితిని వివరిస్తారని చెబుతున్నారు. ఆంటోనీ కమిటీ రాష్ట్రానికి వెళ్లి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సూచించిన వారిని కలుసుకునే విషయంపైనా కోర్కమిటీలో నిర్ణయం తీసుకునే అవకాశముంది.
ఆంటోనీ కమిటీ హైదరాబాద్ వెళ్లి వచ్చిన తర్వాతే కేంద్రంలో కదలిక ఉంటుందని అంటున్నారు. సీమాంధ్రలో పరిస్థితి ప్రశాంతంగా మారేంతవరకూ ఢిల్లీలో తెలంగాణపై వేగవంతంగా నిర్ణయాలు ఉండకపోవచ్చునని సీమాంధ్ర నేతలు భావిస్తున్నారు. ఈ నెల 19న కేంద్ర కేబినెట్లో నోట్ ఖరారవుతుందని తెలంగాణ నేతలు మాత్రం విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిర్ణయం ఆలస్యమైందని, ప్రజల ఆందోళనలు ఉపశమించాలంటే త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధిష్ఠానానికి జైపాల్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి పెంచేందుకు పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన శుక్రవారం ఉదయమే సోనియా గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకుని వెళ్లాలని ఆయన సోనియాకు విజ్ఝప్తి చేసినట్లు సమాచారం. కేబినెట్ నోట్ తయారీకి పెద్దగా సమయం పట్టదని కూడా చెబుతున్నారు. ఇప్పటికే సాంకేతిక అంశాలు సేకరణ పూర్తయిందని, రాజకీయ నిర్ణయం చెప్పి, తగిన దిశా నిర్దేశం చేస్తే దాని ప్రకారం నోట్ తయారు చేస్తారని అంటున్నారు. ఇందుకు సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ నెల 25 నుంచి అక్టోబర్ 1 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఆయన తిరిగి వచ్చేవరకూ కేంద్ర కేబినెట్లో నోట్పై చర్చించే అవకాశాలు లేవనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇది కూడా సోనియా గాంధీ సూచనలపైనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.