తెలంగాణ ముఖచిత్రం: ఉత్తర దక్షిణాల విభజన?
ఈ నెల 30వ తేదీన తెలంగాణలో పోలింగ్ జరగనుంది. హైదరాబాద్ మినహాయిస్తే తెలంగాణలో తొమ్మిది జిల్లాలు ఉన్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో తెలంగాణవాదం బలంగా ఉంది. ఇది తెరాసకు ఉపయోగపడవచ్చునని అంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు కాంగ్రెసుకు అనుకూలంగా ఉండవచ్చు. దానికితోడు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం, బిజెపి వంటి పార్టీలు తమ ఉనికిని చాటుకునే అవకాశం ఉంది.
హైదరాబాద్లో మజ్లీస్ బలంగా ఉంది. పాతబస్తీలో తన బలాన్ని అది నిలుపుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే, తెలంగాణలో తెలుగుదేశం తన పునాదిని కోల్పోయిందని, బిజెపి బలాన్ని పుంజుకోలేదనే అంచనాలు సాగుతున్నాయి. ఉత్తర తెలంగాణలో ఎనిమిది లోకసభ స్థానాలు, 54 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దక్షిణ తెలంగాణలో 9 లోకసభ స్థానాలు, 65 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
ఎనిమిది జిల్లాల్లో లోకసభ, శాసనసభా స్థానాలకు ముక్కోణపు పోటీ జరుగుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని నాలుగు లోకసభ స్థానాలకు, 29 శాసనసభా స్థానాలకు బహుముఖ పోటీ ఉంది. ఈ స్థితిలో మెజారిటీ కోసం కాంగ్రెసు, తెరాస ఒకదానిపై మరోటి పోటీ పడుతున్నాయి.
ప్రస్తుతం లోకసభలో కాంగ్రెసుకు తెలంగాణ నుంచి 12 మంది సభ్యులున్నారు. టిడిపి, తెరాస సభ్యులు ఇద్దరేసి ఉన్నారు. హైదరాబాద్ లోకసభ స్థానానికి మజ్లీస్ నేత అసదుద్దీన్ ఓవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థితిలో కొత్త తెలంగాణ రాష్ట్రంలో మొదటి ప్రభుత్వాన్ని కాంగ్రెసు ఏర్పాటు చేస్తుందా, తెరాస ఏర్పాటు చేస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.