ఎపి ఐఎఎస్ బాసులు తస్మాత్ జాగ్రత్త...సిఎం దృష్టి పడింది...
అమరావతి: ఎపిలో ఇకపై ఐఎఎస్ ల హవాకు గండి పడనుందా? ఇక నుంచి వారి ప్రతి కదలిక పై ప్రభుత్వం దృష్టిపెట్టనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది...ఎలా చెప్పగలరంటే ముఖ్యమంత్రి తాజా వ్యాఖ్యలను బట్టి...
ఇంతకీ సిఎం చంద్రబాబునాయుడు ఏమన్నారంటే హైదరాబాద్ నుంచి వచ్చిపోతున్న కొంత మంది ఐఏఎస్ అధికారులకు ఈ రాష్ట్రంపై మమకారం కనిపించడం లేదని, మొక్కుబడిగా ఉద్యోగం చేస్తున్నారని...ఎక్కడన్నారంటే సచివాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రతిపాదనల ఆమోద బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారట.
సిఎం ఇంకా ఏమన్నారు?
ఐఎఎస్ ల గురించి పత్రికల్లో కథనాలు వస్తున్నా వీరిలో మార్పు కనిపించడం లేదని సిఎం వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నుంచి వచ్చి పోతున్న వారిలో కొందరికి ఈ రాష్ట్రం అభివృద్ధి పట్టడం లేదు. ఇక్కడకు పెట్టుబడులు, కంపెనీలు రావాలన్న తపన వారిలో కనిపించడం లేదు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ విశాఖలో అంతర్జాతీయ స్థాయి డెవల్పమెంట్ సెంటర్ పెట్టడానికి ముందుకు వచ్చింది. 40 ఎకరాల స్థలం అడిగింది. మనం ఒప్పుకున్నాం. కొందరు అధికారులు ఆ ప్రతిపాదనపై రెండు మూడు కొర్రీలు వేశారు. వాటికి సమాధానాలు ఇచ్చిన తర్వాత ఆ కంపెనీకి కేవలం పది ఎకరాల స్థలం చాలని ప్రతిపాదన పంపారు. ఏం పద్ధతి ఇది? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎందుకు అన్నారంటే?...
ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ విశాఖలో తన కార్యాలయం ఏర్పాటు చేసేందుకు కొంత భూమి అడిగితే అందులో నాలుగో వంతు మాత్రమే సిఫారసు చేస్తూ అధికారులు ఎస్ఐపీబీ ముందుకు ప్రతిపాదన పంపడం సిఎంకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అధికారుల వైఖరితో ఆ సంస్థ వెనక్కిపోతే పరిస్థితి ఏంటనేది ముఖ్యమంత్రి అసహనానికి కారణం. అందుకే అధికారుల సిఫార్సులను పక్కనబెట్టి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీకి విశాఖలో 40 ఎకరాలు కేటాయిస్తూ ఎస్ఐపీబీలో నిర్ణయం తీసుకొన్నారు. కిందిస్థాయి అధికారులు ఏ ప్రతిపాదన పంపినా ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఎస్ఐపీబీదే తుది నిర్ణయం కావడంతో ఈ మేరకు నిర్ణయం జరిగింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇన్నోవా సొల్యూషన్స్ కలిసి విశాఖలో ఎనిమిదేళ్లలో రూ.455 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి.
మనకంటే గొప్పనగరాలే ఉన్నాయి...
ఇక్కడ ఉన్న నగరాలకన్నా పెద్ద నగరాలు దేశంలో చాలా ఉన్నాయి. అంతర్జాతీయ సంస్థలు అక్కడే హాయిగా కార్యాలయాలు పెట్టుకోవచ్చు. మనం ఏవైనా ప్రోత్సాహకాలు ఇస్తేనో లేదా బాగా సహకరిస్తామనో అనుకొంటేనే ఇక్కడ దాకా వస్తారు. కంపెనీలు వస్తేనే ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. హోటళ్లు పెరుగుతాయి. పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి కనిపిస్తుంది. మేం ఊరూరా తిరిగి పెద్ద కంపెనీలను రమ్మని ఆహ్వానిస్తున్నాం. తీరా వచ్చిన తర్వాత మనవాళ్లు రకరకాల కొర్రీలు వేసి వాళ్లను విసిగిస్తున్నారని సిఎం ఐఎఎస్ లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఆరోజుల్లో...ఏం జరిగిందంటే...
ఇప్పుడు తాను విదేశీ పర్యటనకు వెళితే తనతో పాటు నలుగురైదుగురు అధికారులు ఉంటున్నారని, పాత రోజుల్లో తానూ తన పేషీలో పనిచేసిన రణదీప్ సుడాన్ మాత్రమే అమెరికాలో రోడ్లు పట్టుకొని తిరిగి కంపెనీలు తెచ్చామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఆ రోజుల్లో సుడాన్ ఎంత కష్టపడ్డారో తనకు తెలుసునని, ఏ కంపెనీ వాళ్లు వస్తామన్నా వారి చుట్టూ తిరిగి వారికి ఏం కావాలో అమర్చి వచ్చేవరకూ ఆయన వదిలిపెట్టేవాడు కాదని గుర్తు చేసుకున్నారు. ఫైళ్లు చూసి అవీ ఇవీ లోపాలు వెతికే వారికి కంపెనీలు వెనక్కిపోతే ఎలాంటి బాధ ఉండదని, అవి రావాలని తపన పడే తమకు ఆ నొప్పి తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఉండి పనిచేస్తేనే ఈ ప్రాంతంపై మమకారం వస్తుందని, మొక్కుబడిగా వచ్చే వారిలో ఆ తపన ఏర్పడటం కొంత కష్టమేనని అన్నారు.
సర్ధిచెప్పిన లోకేష్...
ఐఎఎస్ అధికారుల తీరుపై సీఎం ఆగ్రహంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన కుమారుడు, ఐటీ మంత్రి లోకేశ్ జోక్యం చేసుకొని కొంత చల్లార్చారు. కొందరు అధికారులతో ఇబ్బంది ఉన్నా చాలామంది బాగా చేస్తున్నారని, కష్టపడేవారిని కూడా చూడాలని ఆయన అనడంతో సమావేశంలో వాతావరణం చల్లబడింది. ముఖ్యమంత్రి కూడా నవ్వి పని చేయని వారి గురించే తాను మాట్లాడుతున్నానని అన్నారట. ఏదేమైనా ఇంతకుముందెన్నడూ లేనివిధంగా ఐఎఎస్ లపై సిఎం ఈ స్థాయిలో వ్యాఖ్యలు చెయ్యడంతో ఇక నుంచి ఈ బాస్ లు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వచ్చేసినట్లేనని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.