ఆంధ్రా రాజకీయాల్లో కాపుల కలకలం...ఏం జరగబోతోంది?...
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్ లో కాపులదే కీలక పాత్ర అనే విషయం రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దీంతో తమ ప్రాధాన్యతను గుర్తించిన కాపులు సరికొత్త రాజకీయానికి తెరదీయడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే కాపులు వంగవీటి రంగా కేంద్రంగా నూతన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి రాజ్యాధికారం దిశలో దాన్ని నడిపించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కాపు నేతల ప్రకటనలు,హడావుడి , తాజా పరిణామాలు చూస్తుంటే ఏదో జరగబోతోందనే విషయం అందరికీ అర్థం అయింది. రాజకీయంగా రెడ్డి, కమ్మ సామాజికవర్గాలకు ధీటుగా ఎదగాలని కాపు సామాజికవర్గంలో ఎప్పటినుంచో బలమైన ఆకాంక్ష ఉంది. కాపుల్లో అనైక్యత, పరిస్దితుల అనుకూలత లేక తామనుకున్న దిశలో వేగంగా అడుగులు వెయ్యలేకపొయ్యారు. మరిప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి...
కాపుల రాజ్యం...ప్రజారాజ్యం....
కాపుల్లో రాజ్యాధికారం ఆకాంక్షను ఆలంబనగా చేసుకునే మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేశారు. కాపుల మద్దతు మెగాస్టార్ గా అందరివాడి లాంటి ఇమేజ్ తో పాలిటిక్స్ లో ప్రవేశించి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. దాంతో కాపు నేతల్లో అత్యధికులు చాలామంది పిఆర్పీలో చేరారు. అయితే ఆ పార్టీ కథ అనూహ్యంగా ముగిసింది.
ఆ తరువాత...
ప్రజారాజ్యం నేర్పిన పాఠాలతో ఆ తరువాత ఇంకే కాపు నేతలు ప్రత్యేకపార్టీ ఏర్పాటు దిశగా ఆలోచించలేదు. నిజానికి కాపులకు ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేసేంత స్ధాయి...అందరినీ ఆకట్టుకోగల నేత ఆ సమయంలో మరెవరూ లేరనే చెప్పాలి.
ముందు అన్న...తరువాత తమ్ముడు
అయితే 2014 ఎన్నికలకు ముందు చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హఠాత్తుగా రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన పేరుతో ఓ పార్టీ ఏర్పాటు చేసారు. చివరకు టిడిపి బిజెపి కూటమికి మద్దతు ప్రకటించారు. అయితే పవన్ పెట్టిన జనపార్టీపై అనుకూల, ప్రతికూల ప్రభావాలు రెండూ బలంగా ఉండటం గమనార్హం. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన కాపులందరి మద్దతు పొందే విషయంలో మిశ్రమ స్పందనే కనబడుతోంది. దానికితోడు కాపులకు రిజర్వేషన్ విషయమై పోరాటం పేరుతో కాపుల్లోని చంద్రబాబు వ్యతిరేకుల్లో చాలమంది మొన్నటి వరకూ ముద్రగడ వెంట ఉన్నారు.
అస్థిత్వం కోసమా...రాజ్యాధికారం కోసమా...
ఇటీవలి చోటుచేసుకున్న అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించి బిసిల్లో చేర్చేశారు. దీంతో చిన్న చిన్న సమస్యల విషయం పక్కనబెడితే కాపుల పోరాటానికి ఒక ప్రధాన సమస్య అనేది లేకపోవడం, కాపులను ఏకతాటి మీదకు చేర్చే అంశం లేకపోయింది. ప్రస్తుత రాజకీయాల్లోగాని...వచ్చే ఎన్నికల్లో గాని తమ అస్తిత్వాన్ని బలంగా చాటుకోవాలంటే కాపు నేతలకు వేరే దారేదీ కనబడలేదనే చెప్పుకోవచ్చు. అటువంటి పరిస్దతిల్లోనే కాపు సామాజికవర్గానికి వంగవీటి రంగా వర్ధంతి కలిసివచ్చింది.
వంగవీటి రంగా...రాజకీయాలు...
వంగవీటి మోహనరంగా కాపు సామాజికవర్గానికి చెందిన నేత అయినప్పటికీ దాదాపు అన్నీ సామాజికవర్గాల సుపరిచితుడు. సరిగ్గా ఆ అంశాన్నే రాజకీయ ప్రాబల్యాన్ని కోరుకునే కాపు నేతలు ఆలంబనగా చేసుకొని ప్రస్తుత సమ కాలీన రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో తమ ఉనికిని చాటు కునే ప్రయత్నాలు ప్రారంభించినట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మంగళవారం వంగవీటిరంగా 29వ వర్ధంతి పేరుతో విజయవాడ లో సినీ నటుడు జీవాతో సహా పలువురు కాపు నేతలు చేస్తున్నసందడి ముందు రాజకీయ ప్రాబల్యం...ఆ తరువాత రాజ్యాధికారం దిశలో అడుగులు వెయ్యడం కోసమేనని అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. కాపుల్లో అపారమైన ఆదరాభిమానాలు చూరగొన్నవంగవీటి రంగా బొమ్మ పట్టుకుని, ఆయన పేరు చెప్పుకుని వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందాలన్నది చాలా మంది కాపు నేతల వ్యూహంగా కనబడుతోంది. మరి వీరి ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరుతాయో వేచిచూడాలి.