జగన్ ను చికాకు పెడుతున్న ఆ ఒక్కటి ? ఎన్నికల్లో అదే కీలకం ! విఫలమైతే మాత్రం !
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. మరో 16నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. వీటి కోసం ఇప్పటి నుంచే పూర్తిస్దాయిలో కసరత్తు చేస్తోంది. గడప గడప పేరుతో జనంలోకి వెళుతోంది. ఎన్నికల హామీల్లో 95 శాతం నెరవేర్చేసినట్లు చెప్పుకుంటోంది. అదే సమయంలో ఓ కీలక హామీ మాత్రం వైఎస్ జగన్ ను కలవరపెడుతోంది. అది రాష్ట్రంలో లక్షలాది మందితో ముడిపడింది కావడంతో వచ్చే ఎన్నికల్లో ఈ వ్యవహారం తలనొప్పిగా మారబోతోందన్న ఆందోళన ప్రభుత్వంలో కనిపిస్తోంది.

వైఎస్ జగన్ మాటిస్తే..
ఏపీలో దశాబ్దాల పాటు ఎంతో మంది రాజకీయ నాయకుల్ని చూసిన జనానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓ విషయంలో మాత్రం ఎప్పుడూ ప్రత్యేకంగా కనిపిస్తుంటారు. ఆ విషయంలో ఆయనకు మరెవరితోనూ పోటీ లేదనే స్ధాయిలో జనం ఊహించుకుంటుంటారు. ఇంకా చెప్పాలంటే ఆ విషయంలో తండ్రి వైఎస్సార్ తో మాత్రమే జగన్ ను పోలుస్తుంటారు. ఆ ఒక్క అంశమే 2019 ఎన్నికల్లో జగన్ ను భారీ మెజారిటీతో తొలిసారి అధికారంలోకి తెచ్చిందంటే అతిశయోక్తి కాదు. అదే విశ్వసనీయత. జగన్ మాటిస్తే అది ఎలాగైనా నెరవేరుతుందన్న భావన ఇప్పటికీ రాష్ట్రంలోని సగటు ఓటర్లలో అలాగే ఉంది. కానీ ఓ అంశంలో మాత్రం జగన్ హామీ నెరవేరేలా కనిపించడం లేదు.

జగన్ ఇచ్చిన మాట
రాష్ట్రంలోని ఓ కీలక వర్గానికి 2019 ఎన్నికల సమయంలో వైసీపీ అధినేతగా పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ ఓ కీలక హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే కచ్చితంగా ఆ హామీని నిలబెట్టుకుంటానని చెప్పారు. అప్పటికి దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ ఏ రాజకీయ నేత కానీ, రాజకీయ పార్టీ కానీ ఆ హామీ ఇవ్వలేదు. దీంతో మాటిస్తే దానికి కట్టుబడతారని పేరున్న వైఎస్ జగన్ కచ్చితంగా దాన్ని నిలబెట్టుకుంటారని ఆ వర్గం పూర్తిగా విశ్వసించింది. కానీ జరిగింది వేరు. జగన్ కున్న విశ్వసనీయత రికార్డును ఆ ఒక్క మాట ఇప్పుడు తుడిచి పెడుతుందా అన్న ఆందోళన సొంత పార్టీలోనే కనిపిస్తోంది.

ఉద్యోగుల సీపీఎస్ హామీ
ఉద్యోగులకు 2019 ఎన్నికల సమయంలో మెరుగైన పీఆర్సీతో పాటు సీపీఎస్ రద్దు చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ రెండు హామీల్ని ఆయన కచ్చితంగా నిలబెట్టుకుంటారని పార్టీలు, ప్రాంతాలు, కులమతాలకు అతీతంగా ఉద్యోగులు నమ్మారు. దీంతో జగన్ కు భారీ మెజారిటీ కట్టబెట్టారు. అయితే అధికారంలోకి రాగానే దాదాపు రెండేళ్ల పాటు హామీపై అప్పుడు, ఇప్పుడు అని నమ్మించేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం.. మూడో ఏడాది మాత్రం చేతులెత్తేసింది. స్వయంగా పార్టీ నేత సజ్జల అప్పట్లో తెలియక ఆ హామీ ఇచ్చినట్లు ఉద్యోగులకు చెప్పుకొచ్చారు. కానీ రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న ఉద్యోగులకు ఈ వాదన సమంజసంగా అనిపించలేదు. దీంతో పోరు మొదలైంది.

జగన్ మాట నిలబెట్టుకోకపోతే ?
వైఎస్ జగన్ ఉద్యోగులకు ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీ అమలు చేసే విషయంలో దాదాపు చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. తాజాగా ఉద్యోగుల్ని సీపీఎస్ చర్చలకు అని పిలిస్తే దాదాపుగా వారంతా మొహం చాటేశారు. ఇతర ఉద్యోగసంఘాలు ఇతర అంశాలపై చర్చలకు వచ్చాయి. దీంతో వారితోనే మంత్రుల కమిటీ చర్చలు జరిపి పంపేసింది. త్వరలో మరోసారి సీపీఎస్ పై చర్చలుంటాయని ప్రభుత్వం చెబుతోంది. అయినా ఉద్యోగుల్లో నమ్మకం కుదరడం లేదు.మరోవైపు ఈ హామీ ఇవ్వని నాలుగైదు రాష్ట్రాలు ఇప్పటికే దీన్ని అమలు చేసేశాయి. దీంతో సర్కార్ పై ఒత్తిడి పెరుగుతోంది. అటు ఈ హామీ నిలబెట్టుకోకపోతే మాత్రం కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్ కు ఇబ్బందులు తప్పేలా లేవు. ఎందుకంటే ఎప్పటిలాగే సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగుల సహకారం తప్పనిసరి. జగన్ సీపీఎస్ రద్దు హామీ నిలబెట్టుకోకపోతే మాత్రం వారి ఆగ్రహం చవి చూడక తప్పదనే వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications