వ్యూహమా?: 'బీజేపీలో వైసిపి విలీనమా.. ఇప్పుడే కాదని జగన్ చెప్పారా?'
ఏపీలో బలపడాలనే ఉద్దేశ్యంతో బీజేపీ.. ప్రతిపక్ష వైయస్ జగన్కు కేసులను చూపించి తమలో కలుపుకోవాలని చూస్తోందని ఇటీవల ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
విజయవాడ: ఏపీలో బలపడాలనే ఉద్దేశ్యంతో బీజేపీ.. ప్రతిపక్ష వైయస్ జగన్కు కేసులను చూపించి తమలో కలుపుకోవాలని చూస్తోందని ఇటీవల ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
బీజేపీ ఏపీలో ఎదిగేందుకు ఉవ్వీళ్లూరుతోందని, వైసిపితో తెర వెనుక మంతనాలు జరుపుతున్నట్లుగా చెబుతున్నారని, కేసులలో చిక్కుకున్న జగన్కు అభయహస్తం చూపి తమలో కలుపుకునేందుకు బీజేపీ పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోందని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలపై బైరెడ్డి బాంబు, జగన్కు 'సొంత' పార్టీ నేత ఝలక్
అంతేకాదు, కేసుల నుంచి విముక్తి పొందాలంటే పార్టీని విలీనం చేయాలని బీజేపీ చెప్పిందని, అయితే వచ్చే ఎన్నికల తర్వాత విలీనం చేస్తానని జగన్ చెప్పినట్లుగా తెలుస్తోందని, ఇప్పుడే విలీనం చేస్తే మైనార్టీలు దూరమవుతారని, కాబట్టి ఆ తర్వాత విలీనం చేస్తానని ఆయన వివరించినట్లుగా తెలిసిందని పేర్కొన్నారు.
చర్చనీయంగా మారిందా?
ఈ అంశం ఇప్పుడు వైసిపిలో చర్చకు దారి తీసిందని మరో కథనం వచ్చింది. ఇది పార్లమెంటులో ఎంపీల మధ్య చర్చకు దారి తీసిందని పేర్కొన్నారు. సోమవారం పార్లమెంటు ప్రారంభమైన తర్వాత ఏపీ, తెలంగాణలకు చెందిన ఎంపీల మధ్య ఈ అంశంపైనే చర్చ జరిగిందట.
వైసీపీ ఎంపీలు ఎవరు కలిసినా వారితో ఇతర పార్టీల ఎంపీలు.. బీజేపీలో ఎప్పుడు విలీనం అవుతున్నారని ప్రశ్నించారని పేర్కొన్నారు. అయితే, విలీనంపై తమకు ఎలాంటి సమాచారం లేదని, అటువంటిదేమీ ఉండకపోవచ్చునని, అయినా అది పెద్ద వాళ్ల విషయమని, చివర్లో మా నిర్ణయం అడిగితే అడగవచ్చునని, లేకపోతే అదీ ఉండదని వైసీపీ ఎంపీలు బదులిచ్చారని పేర్కొన్నారు.