కృష్ణా జిల్లాలో త్వరలో అశోక్ లేల్యాండ్ బస్ ప్లాంట్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో రెండు ప్రతిష్టాత్మక సంస్థలు వస్తున్నాయి. ఒకటి ఆటోమొబైల్ రంగంలో ప్రతిష్టాత్మక సంస్థ అశోక్ లేల్యాండ్, మరొకటి ఎంఎఫ్సీజీ తయారీ రంగంలో ముందున్న విప్రో ఎంటర్ప్రైజెస్. బుధవారం సచివాలయంలో విప్రో సంస్థ సీఎఫ్వో రాఘవ్ స్వామినాథన్, అశోక్ లేల్యాండ్ సీఎండీ వినోద్ కె దాసరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో విడివిడిగా భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల కేంద్రాన్ని నెలకొల్పేందుకు సిద్ధంగా వున్నామని రాఘవ్ స్వామినాథన్ ముఖ్యమంత్రికి తెలిపారు. రూ. 200 కోట్లు నుంచి రూ. 350 కోట్లు పెట్టుబడి పెడతామని, తమ యూనిట్ నెలకొల్పేందుకు రాష్ట్రంలో 40 ఎకరాల భూమిని కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు. సబ్బులు, ఎల్ఈడీ ఉత్పత్తుల తయారీని చేపట్టాలని భావిస్తున్నట్టు వివరించారు.
కృష్ణాజిల్లా మల్లవల్లి పారిశ్రామికవాడలో త్వరలో అశోక్ లేల్యాండ్ బస్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. ఈ ప్లాంట్కు సంబంధించి ప్లాన్ వివరాలను ముఖ్యమంత్రికి వినోద్ కె దాసరి అందించారు. మొత్తం 75 ఎకరాల్లో నెలకొల్పనున్న ఈ ప్లాంట్ ఏడాదికి 4,800 బస్సులు తయారు చేసే సామర్ధ్యం కలిగివుంటుందని, 5 వేల మందికి పైగా ఉద్యోగావకాశాలు కలుగుతాయని తెలిపారు.
బస్సుల తయారీతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి కేంద్రం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. భూకేటాయింపులు, ఇతర అనుమతులు పూర్తిగా వచ్చిన ఏడాదిలోగా ఉత్పత్తి ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నామని వినోద్ కె దాసరి ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ వరుస సమావేశాల్లో వాణిజ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎస్ సాల్మన్ ఆరోకియారాజ్ పాల్గొన్నారు.