బాబాయ్ అలక వీడినట్లేనా : కీలక సమయంలో పార్టీకి దూరంగా: ఆ పదవి మీకే..జగన్ హామీతో ఓకే..!
Recommended Video
వైసిపి అధినేత జగన్కు ఆయన ఆత్మబంధువుగా వ్యవహరించారు. జగన్ తరువాత పార్టీలో విజయసాయిరెడ్డికి ఎంత ప్రాధన్యత ఉందో..అదే విధంగా జగన్ సుబ్బారెడ్డికి అదే గుర్తింపు లభించింది. వైయస్సార్ మరణం సమయం నుండి జగన్ తో పాటుగా ఆయన కుటుంబానికి వైవీ సుబ్బారెడ్డి అండగా నిలిచారు. ఒంగోలు ఎంపీగానూ వ్యవహరించారు. కానీ, తాజా ఎన్నికల సమయంలో పార్టీకి దూరమయ్యారు. అయితే, తాజాగా జగన్ ఇచ్చిన హామీతో ఆయన మొత్తబడినట్లుగా తెలుస్తోంది. దీంతో...బాబాయ్ అలక వీడారని తెలుస్తోంది.

తొలి నుండి అండగా నిలిచి..
వైయస్సార్ మరణం తరువాత జగన్ కుటుంబానికి సుబ్బారెడ్డి పెద్ద దిక్కుగా నిలిచారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించారు. 2014 ఎన్నికల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో సుబ్బారెడ్డి ఒంగోలు లోక్సభ స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాతనే జిల్లాలో రాజకీయంగా కొందరు నేతలతో విబేధాలు వచ్చాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి..సుబ్బారెడ్డి మధ్య గ్యాప్ ఉన్నట్లుగా చెబుతారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన తరువాత సుబ్బారెడ్డికి జగన్ ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దులు ఖరారు వరకు సుబ్బారెడ్డి పార్టీ కోసం బాగానే పని చేసారు. ఇక,ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ఒంగోలు సీటు ఇస్తున్నారనే సమాచారంతో సుబ్బారెడ్డి మనస్థాపానికి గురయ్యారు. అప్పటి నుండి పార్టీకి దూరంగా ఉంటున్నారు.

ఒంగోలు సీటు ఇవ్వలేదనే..
ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వారికి తిరిగి పోటీకి అవకాశం ఇవ్వాలని తొలుత నిర్ణయించారుద. అయితే, తాజా ఎన్నికల్లో టిడిపి నుండి వచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు నుండి అవకాశం ఇస్తున్నట్లు జగన్ స్వయంగా సుబ్బారెడ్డితో చెప్పారు. అయితే, సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి జగన్ వద్దకు వచ్చి తనకే సీటు కేటాయించాలని అభ్యర్దించారు. మాగుంట పార్టీలోకి వచ్చినా సీటు తనకే అంటూ మీడియా సమావేశంలో చెప్పారు. దీని పైనా జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక, మాగుంట పార్టీలో చేరటం..ఆయనకు ఒంగోలు లోక్సభ సీటు ఇవ్వటం జరిగిపోయాయి. ఇదే సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు అసెంబ్లీ స్థానం నుండి బరిలో ఉన్న బాలినేని శ్రీనివాసులు రెడ్డిని గెలిపిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తానంటూ జగన్ ప్రకటించారు. ఇది కూడా సుబ్బారెడ్డికి నచ్చేలేదు. దీంతో..గ్యాప్ మెయిన్టెయిన్ చేస్తున్నారు.

జగన్ ఇచ్చిన హామీతో...
అయితే తొలి నుండి తమతోనే ఉన్న సుబ్బారెడ్డికి ఎన్నికల్లో సీటు ఇవ్వలేక పోయినా..పార్టీ అధికారంలోకి వస్తే తగిన గుర్తింపు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు సైతం సుబ్బారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. దీంతో..జగన్ కొత్త ఆలోచన చేసారు. పార్టీలో యాక్టివ్గా ఉండాలని..అధికారంలోకి రాగానే మంచి పదవి ఇస్తామని చెప్పినట్లు సమాచారం. ఆ సమయంలో జరిగిన చర్చలో భాగంగా....వైసీపీ అధికారంలోకి వస్తే సుబ్బారెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా అవకాశం దక్కుతుందని హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో..సుబ్బారెడ్డి మెత్తబడినట్లుగా తెలుస్తోంది. ఫలితాలు వచ్చే దాకా ఎవరూ గెలుపు గురించి ఎక్కువగా వ్యాఖ్యలు చేయవద్దని..ఫలితాలు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాయని జగన్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications