శీలానికి వెలకట్టిన టీడీపీ నేత: మనస్తాపంతో యువతి ఆత్మహత్య!..
స్థానిక టీడీపీ నేత మధ్యవర్తిగా వ్యవహరించి.. యువతికి రూ.50వేలు ముట్టజెప్పడం ద్వారా విషయాన్ని కనుమరుగు చేయించడానికి ప్రయత్నించారు.
నెల్లూరు: ప్రేమ పేరుతో మోసాలు.. ఆ తర్వాత పెద్ద మనుషుల పంచాయితీలో డబ్బులు చెల్లించి చేతులు దులుపుకోవడం.. గ్రామాల్లో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలం బండారుపల్లిలోను ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
బండారుపల్లికి చెందిన కటారి నాగార్జున అనే దర్జీ.. దగ్గరి బంధువైన ఓ యువతిని ప్రేమించాలంటూ పలుమార్లు ప్రాధేయపడ్డాడు. యువతి ససేమిరా అనడంతో.. మాయ మాటలతో ఆమెను లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి రెండు నెలల క్రితం బెంగుళూరుకు తీసుకెళ్లాడు.
ఇద్దరూ కలిసి ఓ ఇంట్లో కాపురం పెట్టగా.. రోజులు గడుస్తున్న కొద్ది నాగార్జున పెళ్లి మాటెత్తడం మరిచిపోయాడు. మూడు రోజుల క్రితం వీరిద్దరూ బండారుపల్లికి రాగా.. పెద్ద మనుషుల సమక్షంలో దీనిపై పంచాయితీ పెట్టారు. స్థానిక టీడీపీ నేత మధ్యవర్తిగా వ్యవహరించి.. యువతికి రూ.50వేలు ముట్టజెప్పడం ద్వారా విషయాన్ని కనుమరుగు చేయించడానికి ప్రయత్నించారు.
న్యాయం చేస్తారని భావిస్తే.. శీలానికే వెల కట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శుక్రవారం నాడు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడటంతో హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో నాగార్జున మరో యువతిని కూడా ఇలాగే మోసం చేశాడని బాధిత యువత చెబుతోంది.