బ్రోతల్ కేసులో ఇరికించేస్తా!: ఎస్ఐ బెదిరింపులకు మహిళ ఆత్మహత్యాయత్నం
బ్రోతల్ కేసులో ఇరికించి అండమాన్ జైలుకు పంపించేస్తానని, స్థానికుల సంతకాలు తీసుకుని ఇంటినే కూల్చేస్తానని తీవ్రంగా అవమానించాడు. అక్కడితో ఆగకుండా ఆమెను చితకబాదాడు.
గుంటూరు: బలవంతుల మీద బలహీనంగా.. బలహీనుల మీద బలంగా ఈ దేశంలో చట్టలు అమలువుతున్న మాట వాస్తవం. ఎన్నడూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కని అమాయక జనం.. ఎన్నడైనా అటువైపు తొంగిచూస్తే.. న్యాయం జరగకపోదు సరికదా.. లేనిపోని అవమానాలను సైతం ఎదుర్కోవాల్సి వస్తుంది.
తాజాగా గుంటూరు జిల్లా చెరుకుపల్లి ఆరుంబాకలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. న్యాయం చేస్తాడనుకున్న ఎస్సై బ్రోతల్ కేసులో ఇరికిస్తానంటూ ఓ దళిత మహిళను వేధించాడు. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సదరు మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆరుంబాకలో జరుగుతోన్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఏసురత్నం అనే స్థానికుడి ఇంటి మెట్లను కూల్చివేశారు.ఇది అన్యాయమంటూ ఏసురత్నం, అతని భార్య సువార్తమ్మ సర్పంచ్ ను నిలదీశారు. మమ్మల్నే ఎదిరించేంత ధైర్యమా? అని సర్పంచ్ ప్రసన్నత, ఆమె భర్త కిరణ్, వారి అనుచరులతో కలిసి ఏసురత్నం,సువార్తమ్మపై దాడి చేశారు.
సర్పంచ్ దాడితో చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితులు న్యాయం చేయాల్సిందిగా కోరారు.ఇదే నేపథ్యంలో ఆదివారం రాత్రి వారిద్దరిని స్టేషన్ కు పిలిపించిన ఎస్ఐ భాస్కర్ బ్రోతల్ కేసులో ఇరికిస్తానంటూ సువార్తమ్మను బెదిరించాడు.
బ్రోతల్ కేసులో ఇరికించి అండమాన్ జైలుకు పంపించేస్తానని, స్థానికుల సంతకాలు తీసుకుని ఇంటినే కూల్చేస్తానని తీవ్రంగా అవమానించాడు. అక్కడితో ఆగకుండా ఆమెను చితకబాదాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, మరో 24గం. గడిస్తే తప్ప ఏమి చెప్పలేమని డాక్టర్లు తెలిపారు.
తల్లి పరిస్థితి చూసి బాధితురాలి కూతురు కన్నీరుమున్నీరవుతోంది. తన తల్లికేమైనా అయితే తన పరిస్థితేంటని ఆమె విలపిస్తోంది.