మామ హత్య: ఈవెంట్ మేనేజర్ రాధిక, డ్రైవర్ అరెస్టు

ఈ కేసుకు సంబంధించిన వివరాలను క్రైమ్స్ అదనపు ఉపకమిషనర్ జి.జానకీషర్మిల, సహాయ కమిషనర్ శ్రీనివాస్తో కలిసి శుక్రవారం వెల్లడించారు. సాకేత్లోని కొక్కొండ వెంకట లక్ష్మీనరసింహరావు (90) ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫిబ్రవరి 17న హత్యకు గురయ్యాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన కుషాయిగూడ పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు.
తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం మొగలికుదురు గ్రామానికి చెందిన లక్ష్మీనరసింహరావు కొన్నాళ్ల క్రితం సాకేత్లో స్థిరపడ్డాడు. రాజమండ్రికి చెందిన డి.రాధిక నగరంలోని గాంధీనగర్లో ఉంటోంది. వరంగల్కు చెందిన మలోతు దామోదర్ ఆమె వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రాధిక ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తోంది. లక్ష్మీనరసింహారావుకు రాధిక వరుసకు మేనకోడలు. డిసెంబర్లో సాకేత్ క్లబ్లో ఈవెంట్ నిర్వహిస్తున్నానని చెప్పి రాధిక ఆయన ఇంటికి వెళ్లింది.
ఆ సమయంలో బీరువా తాళాలు కాజేసి బయట ఉన్న డ్రైవర్కిచ్చి నకిలీ తాళాలు తయారు చేయించింది. తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయింది. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం లక్ష్మీనరసింహారావు ఇంటికి రాధిక ఫోన్ చేసి ఎవరెవరు ఉన్నారని తెలుసుకుంది. ఆయన ఒక్కడే ఉండడంతో చోరీకి పక్కా ప్రణాళిక రూపొందించింది. డ్రైవర్తో కలిసి ఆయన ఇంటికి వెళ్లింది. రాధిక డూప్లెక్స్ ఇంట్లో నుంచి మేడపైకి వెళ్లగా, డ్రైవర్ బయట కాపలాగా ఉన్నాడు. శబ్ధం కావడంతో లక్ష్మీనరసింహారావు నిద్రలేచి రాధికను గుర్తుపట్టాడు. అసలు విషయం బయటకు వచ్చేస్తుందని భావించిన రాధిక డ్రైవర్ను పిలిచి లక్ష్మీనరసింహారావు పీకకు తువాలు బిగించి హత్య చేసింది.
తర్వాత బీరువా తాళాలు తీసుకుని ఆభరణాలు, సోనీప్లేయర్ కాజేసింది. కారు నంబర్ తెలియకుండా ప్లేట్పై తెల్ల కాగితం అతికించారు. హత్య జరిగిన రోజున నీలం రంగు సాంత్రో కారు ఆ పరిసర ప్రాంతాల్లో తిరగడం సిసి కెమెరాల ఫుటేజీల్లో స్పష్టంగా కనిపించింది. దీంతో పోలీసులు ఈ వాహనంపై దృష్టిసారించారు.
పోలీసు విచారణలో రాధిక, దామోదర్ చేసిన మరో రెండు కేసులు కూడా బయటపడ్డాయి. రాధిక కేవలం బంధువుల ఇళ్లనే లక్ష్యం చేసుకుని కార్యకలాపాలు నడిపింది. ఎస్ఆర్ నగర్లో ఉంటున్న చెల్లెలు, ముషీరాబాద్లో ఉంటున్న ఆడపడుచు ఇంట్లోనూ ఈ విధంగానే చోరీలు చేసింది. బంధువులను మాటల్లో పడేసి బీరువా తాళాలు కాజేసేది. వాటితో మారు తాళాలు తయారు చేయించి ఇళ్లలో ఎవరూ లేని సమయంలో ఆభరణాలు కాజేసేది. ఈ కేసుల్లో వారి నుంచి 25 లక్షల రూపాయల విలువ గల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
రాధిక, దామోదర్ నుంచి ఆభరణాలను కొనుగోలు చేసిన సూరజ్ భాను జువెలర్స్ (బషీర్బాగ్) అధినేతలు ఓం ప్రకాశ్ అగర్వాల్, నీరజ్ కుమార్ అగర్వాల్ను అరెస్టు చేశారు. రాధికకు సంబంధించిన ఎటువంటి రశీదులను పరిశీలించకుండానే వారు ఆభరణాలను కొనుగోలు చేశారని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications