మహిళపై గ్యాంగ్ రేప్: హత్య చేసి తగులబెట్టిన దుండగులు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మండల పరిధిలోని స్టేషన్ ధారూరు శివారులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలోని పాత రైలు పట్టాలకు కొంత దూరంలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించిన పశువుల కాపర్లు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి చర్మం ఊడిపోయి ఉంది. తల వెంట్రుకలు రాలి, ముఖం పూర్తిగా గుర్తుపట్టని విధంగా ఉంది. మృతదేహం ఆనవాళ్లను బట్టి గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
హత్యకు గురైన మహిళ 30-35 సంవత్సరాల మధ్య వయస్కురాలై ఉంటుందని తెలిపారు. సంఘటనా స్థలంలో మృతదేహం ఆనవాళ్లను బట్టి ఈ ఘటన దాదాపు పక్షం రోజుల కిందే జరిగి ఉంటుందని, జన సంచారం లేని ప్రదేశం కావడంతో ఘటన ఆలస్యంగా వెలుగు చూసిందని తెలిపారు. మృతదేహం వెల్లకిలా పడి ఉండి, ముఖంతో పాటు శరీరం మొత్తం చర్మం పూర్తిగా ఊడిపోయి గుర్తు పట్టని విధంగా ఉంది.
హత్యకు గురైన మహిళ కాళ్లకు తక్కువ ధరకు లభించే రబ్బరు చెప్పులు ధరించి ఉంది. మృతురాలిపై ఎర్రని చీర, ఆ చీరపై తెలుపు, నలుపు రంగులో పూల డిజైన్లు ఉన్నాయి. సంఘటనా స్థలానికి కొంత దూరంలో కల్లు ప్యాకెట్లు పడి ఉన్నాయి. సంఘటన స్థలంలో లభించిన పలు ఆనవాళ్లను బట్టి లైంగికదాడితో పాటు హత్యకు గురైన మహిళ కూలీ అయి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.
మృతురాలిని రైలులో తీసుకుని వచ్చి లైంగికదాడి చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మృతదేహం పోస్టుమార్టానికి తరలించని విధంగా ఉందని పోలీసులు తెలిపారు. దీంతో అక్కడే వైద్యులచే శవ పరీక్షలు జరిపించి ఘటనా స్థలానికి సమీపంలోనే ఖననం చేశామని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మల్లేశం తెలిపారు.