మహిళను ఇంట్లో నిర్బంధించి రేప్, వీడియో తీసి బెదిరింపు

శనివారం రాత్రి బాధితురాలి భర్త మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో స్థానికంగా ఉంటున్న హఫీజ్, అబు ఫైజల్లు వీరి ఇంటి తలుపు కొట్టారు. బాధితురాలు తలుపు తీసింది. వారు ఆమెను బలవంతంగా హఫీజ్ ఇంట్లోకి తీసుకు వెళ్లి నిర్బంధించారు.
అత్యాచారానికి పాల్పడి సెల్ఫోనులో చిత్రీకరించి బెదిరించారు. బాధితురాలు ఆదివారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుల పైన కిడ్నాప్, అత్యాచారం కేసులు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
యువకుడి హత్య
బొల్లారంలో శనివారం అర్ధరాత్రి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. రాకేష్ (26) జులాయిగా తిరుగుతుంటాడు. గతంలో జేబుదొంగతనాలకు పాల్పడేవాడు. వచ్చిన డబ్బుతో మద్యం తాగి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసేవాడు.
గతంలో బొల్లారం రైల్వే స్టేషన్లో రైలు కింద చేతులు పెట్టి ఓ చెయ్యిని పోగొట్టుకున్నాడు.
రాకేష్ను శనివారం అర్ధరాత్రి దుండగులు తలపై బండరాయితో మోదారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొనఊపిరితో ఉన్న రాకేష్ను గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య
నిజాంపేట గ్రామ పరిధిలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఉంటున్న దంపతులు ఆర్థిక ఇబ్బందులతో ఆదివారం ఇంట్లో ఫ్యాన్లకు వేర్వేరుగా ఉరివేసుకున్నారు. లేటు వయసులో పెళ్లి కావటం, పిల్లలు లేకపోవటం, కుటుంబపోషణ భారం కావడంతో జీవితంపై విరక్తి చెందిన వీరు బలవన్మరణానికి పాల్పడ్డారు.
రాజీవ్ గృహకల్ప సముదాయంలోని 63/27లో కొంతకాలంగా క్రిష్టోఫర్ (55), సునీతాదేవి (50) దంపతులు నివసిస్తున్నారు. వీరికి 2008లో ఆలస్యంగా వివాహం జరిగింది. గతంలో ఒక హోటల్లో పని చేసిన క్రిష్టోఫర్ కొంతకాలంగా ఖాళీగా ఉంటున్నాడు. ఇతర ఉద్యోగాల కోసం పలుచోట్ల ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. కుటుంబపోషణ కోసం బంధువుల మీద ఆధారపడవలసి వచ్చింది.
లేటు వయసులోనైనా ఒకరికి ఒకరు తోడుగా ఉండటం కోసం పెళ్లిచేసుకున్న వీరు బతుకు బండిని లాగలేక ఆదివారం ఉదయం ఇంట్లో ఫ్యాన్లకు చున్నీలతో ఉరివేసుకున్నారు. పక్కింటి వాళ్లు గమనించి పోలీసులకు సమాచారమందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. వీరు రాసిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. దంపతులు తోడు కోసం ఓ కుక్కని పెంచుకున్నారు. సంఘటన స్థలంలో కుక్క కోసం డాక్టర్ రాసిన మందుల చీటీ ఉంది. ఎస్ఐ రాంప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications