ప్రియుడితో కల్సి మాజీ ప్రియుడ్ని చంపింది, పేరెంట్స్పై చిన్నారులు ఫిర్యాదు
కడప: వైయస్సార్ కడప జిల్లా రాజంపేటలో అదృశ్యమైన యువకుడు సాయి ప్రకాశ్ రాజ్ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. అతడిని ఆమె మాజీ ప్రియురాలు సునీత చంపిందని పోలీసులు బుధవారం తేల్చారని తెలుస్తోంది.
ప్రియుడు నాగేంద్రతో కలిసి సాయి ప్రకాశ్ రాజ్ను హతమార్చిందని సమాచారం. గుట్టు చప్పుడు కాకుండా వీరు మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
కాగా, ఈ నెల 28వ తేదీన సాయి కనిపించడం లేదని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. నిందితురాలు సునీతతో సాయికి వివాహేతర సంబంధం అనుమానిస్తున్నారు. ఆతడిపై ఆమె గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది.
తల్లిదండ్రులపై చిన్నారుల ఫిర్యాదు
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో చిన్నారులు తమ తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదువుకుంటామంటే తల్లిదండ్రులు మందలించారని చిన్నారులు సిద్ధు(13), రేష్మి(8) వీరవల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమను బడి మానేసి పనికి వెళ్లమంటున్నారని సదరు చిన్నారులు ఫిర్యాదు చేశారు. వీరు బాపులపాడు మండలం వీరవల్లిలోని అమ్మమ్మ సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారులు తల్లిదండ్రులపై ఫిర్యాదు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.