కుమారుడ్ని చంపేసి, రోజుకో అవయవం నరికేసింది, తల నరుకుతూ...
గుంటూరు: తన చేతిలో హతమైన కుమారుడి మృతదేహం నుంచి బుధవారం రాత్రి కత్తితో నరుకుతూ తలను వేరు చేయడానికి ప్రయత్నిస్తూ అంజనా దేవి పట్టుబదడింది. దీర్ఘకాలిక వ్యాధికి చికిత్సకోసం ఆస్తిని విక్రయించమని ఒత్తిడి చేస్తున్న కన్న కొడుకును ఓ మహిళ దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే.
కుమారుడిని చంపేసి అంజనా దేవి మృతదేహాన్ని గోనెసంచీలో పెట్టి ఆరు రోజులుగా ఇంటి పక్కనే దాచి పెట్టింది. మృతదేహం నుంచి ఒక్కో రోజు ఒక్కో అవయవాన్ని వేరు చేస్తూ వచ్చింది. చివరకు తలను నరుకుతూ పట్టుబడింది. రెండు రోజుల క్రితం మృతదేహం నుంచి చేయిని వేరు చేి సంచిలో పెట్టింది. బుధవారం రాత్రి తలను నరుతుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వివాదం ఇదీ...
అంజనాదేవి కుమారుడు కోటేశ్వర రావు తన భార్య శైలజను పుట్టింట్లో వదిలి ఈ నెల 12వ తేదీన గుంటూరు జిల్లా కాకుమాను మండలం బోడెపాలెం గ్రామానికి చేరుకున్నాడు. తన తల్లి పేరు మీద ఉన్న 3.23 ఎకరాల భూమిలో అర ఎకరం విక్రయించి డబ్బులు ఇవ్వాలని తల్లిని కోరాడు. తల్లి నిరాకరించడంతో గొడవకు దిగాడు.
అంజనాదేవి అదే గ్రామంలో నివాసం ఉంటున్న తన సోదరుడు గార్లపాటి నాగేశ్వరరావును, అంగలకుదురులో ఉంటున్న కూతురు ముప్పవరపు నాగలక్ష్మిని ఫోన్ చేసి పిలిపించుకుంది. కొడుకుతో ఆస్తి వివాదం గురించి వారికి వివరించింది. దీంతో ముగ్గురు కలిసి అతన్ని హతమార్చడానికి పథకం వేశారు.
ఇలా చంపేశారు...
ఈ నెల 13వ తేదీ రాత్రి అంజనాదేవి, నాగేశ్వర రావు, నాగలక్ష్మి కలిసి కోటేశ్వర రావును తలపై బలమైన ఆయుధంతో మోది చంపేశారు. మృతదేహాన్ని సంచిలో చుట్టి ఇంటి పక్కనే ఉంచారు. శైలజకు తన భర్త నుంచి ఏ విధమైన ఫోన్ రాకపోవడంతో బోడిపాలెం వచ్చి అత్తను అడిగింది. నెల్లూరు వెళ్లాడని, వారం పది రోజుల తర్వాత వస్తాడని చెప్పింది.
పందికొక్కులు చచ్చాయని....
ఇంట్లో దర్వాసన రావడం గ్రహించిన శైలజ తన అత్తను నిలదీసింది. ఇంటిపక్కన పందికొక్కులు చచ్చాయని దాటవేసింది. ఎక్కువ సేపు కోడలు ఇంట్లో ఉంటే విషయం బయటపడుతుందని గ్రహించి తాను అత్యవసరంగా గుంటూరు వెళ్లాలని చెప్పి శైలజను పుట్టింటికి పంపించింది. ఇంట్లో కుమారుడి ఫొటోలు, ఆధార్ కార్డులు మాయం చేసింది. ఉన్మాదిలా మారి కుమారుడి మృతదేహనం నుంచి కత్తితో నరుకుతూ ఒక్కో అవయవాన్ని వేరు చేస్తూ గోనెసంచీలో పెడుతూ వచ్చింది.
ఇదీ సంసారం...
కాకుమాను మండలం బోడిపాలెం గ్రామానికి చెందిన అంజనాదేవికి బత్తినేని కోటేశ్వరరావు (44) అనే కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కోటేశ్వరరావుకు నిడుబ్రోలుకు చెందిన శైలజతో 2004లో వివాహం జరిగింది. వీరిరువురికీ ప్రాణాంతక వ్యాధి సోకి దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తనకు సంక్రమించిన ఆస్తిని వైద్య ఖర్చుల నిమిత్తం విక్రయించుకున్న కోటేశ్వరరావు అవి కూడా సరిపోక అప్పుల పాలయ్యాడు.
తల్లి అంజనాదేవి పేరు మీద ఉన్న మూడున్నర ఎకరాల భూమిలో అర ఎకరం విక్రయించి ఇస్తే వైద్యం చేయించుకుంటానని కోరాడు. పొలం విక్రయించడానికి అంజనాదేవి నిరాకరించింది. దీంతో కోటేశ్వరరావు తల్లితో ఘర్షణ పడ్డాడు. పొలం విక్రయించాల్సిందేనని కుమారుడు కొన్ని రోజులుగా తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో కోటేశ్వరరావు దంపతులు ఇటీవల ఊరు వెళ్లారు. ఈ నెల 12వ తేదీన కోటేశ్వరరావు ఒక్కడే గ్రామానికి తిరిగి వచ్చినట్లు స్థానికులు చెప్పారు. ఆ రోజు రాత్రి తల్లితో తీవ్రంగా ఘర్షణ పడినట్లు సమాచారం. ఆ తర్వాతి రోజు నుంచి కోటేశ్వరరావు ఆచూకీ లేకుండా పోయాడు.
అంజనాదేవిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆస్తి విక్రయించమని ఒత్తిడి చేస్తున్న కుమారుడిని హత్య చేసినట్లు అంగీకరించింది. మృతదేహాన్ని ఆనవాలు కూడా లేకుండా ఛిద్రం చేసి మాయం చేసే క్రమంలో దుర్వాసన రాకుండా బ్లీచింగ్ను చల్లినట్లు పోలీసులు గుర్తించారు.
కోటేశ్వరరావు శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి భార్య శైలజ ఫిర్యాదు మేరకు కోటేశ్వరరావు హత్యలో అంజనాదేవికి సహాయపడిన ఆమె కుమార్తె ఎం.నాగలక్ష్మి, తమ్ముడు గార్లపాటి నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పొన్నూరు రూరల్ సీఐ సీహెచ్.సుబ్రహ్మణ్యం, కాకుమాను ఎస్సై ఎన్.లోకేశ్వరరావు సందర్శించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.