కొడుకును నరికి చంపి, శవాన్ని పూడ్చి పెట్టింది
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. కన్న తల్లే తన కుమారుడిని హత్య చేసింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కాశిరెడ్డినగర్లో చోటు చేసుకుంది. కుమారుడి వేధింపులు భరించలేక కన్నతల్లి అతన్ని హతమార్చింది.
శివశంకర్ అనే యవకుడు గత పదేళ్లుగా రోజూ తాగి వచ్చి, ఇంట్లో భార్యాపిల్లలతో పాటు తల్లిని కూడా తీవ్రంగా వేధిస్తూ వస్తున్నాడు. ఎవరు ఎంతగా చెప్పినా అతను తన పద్ధతి మార్చుకోలేదు. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి కూడా ఇంట్లో గొడవ జరిగింది. దాంతో సహనం కోల్పోయిన తల్లి నరసమ్మ అతడిని గొడ్డలితో నరికి చంపింది.

కుమారుడిని చంపిన తల్లి నరసమ్మ గుట్టు చప్పుడు కాకుండా అతని శవాన్ని పూడ్చి పెట్టింది. కాలనీవాళ్లకు కూడా ఈ విషయం తెలుసునని అంటున్నారు. అయితే, శివశంకర్ ఆగడాల గురించి తెలియడంతో ఎవరూ ఈ విషయం బయటపెట్టలేదు. కానీ ఆ నోటా ఈ నోటూ విషయం పోలీసులకు చేరింది.
దాంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చిన తర్వాత నరసమ్మ తన నేరాన్ని అంగీకరించింది. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications