రెండు పెళ్లిళ్లు, ఇద్దరు పిల్లలు: మంచానికి కట్టి, పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన ప్రియురాలు
ప్రకాశం: జిల్లాలోని కొనకనమిట్ల మండలం చౌటపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని ఓ మహిళ అత్యంత దారుణంగా హత్య చేసింది. కాగా, మృతుడికి అప్పటికే రెండు వివాహాలు కావడం, ఇద్దరు పిల్లలు కూడా ఉండటం గమనార్హం.
హతుడు హోంగార్డు అయినప్పటికీ గత కొంతకాలంగా విధులకు దూరంగా ఉంటున్నారు. శనివారం రాత్రి జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితురాలి కోసం గాలిస్తున్నారు.
రెండు పెళ్లిళ్లు
పొదిలి సీఐ మాకినేని శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. పొదిలి పట్టణానికి చెందిన ఎస్కే షబ్బీర్ (35) మర్రిపూడి పోలీసు స్టేషన్లో హోంగార్డుగా పనిచేసేవాడు. రెండు నెలలుగా విధులకు దూరంగా ఉన్నాడు. అయిదేళ్ల క్రితం షబ్బీర్కు వివాహమైంది. వీరికి ఓ బాబు పుట్టాడు. అనంతరం ఆమెకు విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు కూడా బాబు పుట్టాడు.
మరో మహిళతో వివాహేతర సంబంధం
కాగా, షబ్బీర్కు పొదిలి పట్టణానికి చెందిన షకీరా అలియాస్ ఇమాంబీ అనే వివాహితతో పరిచయం ఏర్పడింది. ఆమెతో సంబంధం కొనసాగించాడు. ఇద్దరూ కలిసి వ్యాపారం చేద్దామని ఆలోచన చేశారు. కొనకనమిట్ల మండలం చౌటపల్లి, పేరారెడ్డిపల్లెలో రెండు కోళ్ల ఫారాలను లీజుకు తీసుకుని వ్యాపారం ప్రారంభించారు.
మంచానికి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పుపెట్టింది
ఈ క్రమంలో వ్యాపారం, ఇతరత్రా విషయాల్లో ఇద్దరి మధ్యా గొడవలు మొదలయ్యాయి. దీంతో షబ్బీర్ను అంతమొందించాలని ఇమాంబీ ప్రణాళిక వేసింది. శనివారం రాత్రి కోళ్లఫారానికి వచ్చిన అతడిని ఏమార్చి కాళ్లు, చేతులను గొలుసులతో మంచానికి కట్టేసింది. ముందుగానే సిద్ధం చేసుకున్న పెట్రోలును అతడిపై పోసి నిప్పంటించింది. షబ్బీర్ గట్టిగా కేకలు వేయడంతో పరిసరాల్లోని వారు అక్కడికి వచ్చారు. నివాసం నుంచి పొగలు వస్తున్నాయేంటని ఆమెను వారు ప్రశ్నించగా.. చెత్త తగులబెడుతున్నామని నమ్మబలికింది.
పరారీలో నిందితురాలు
అయితే, వారు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పొదిలి సీఐ శ్రీనివాసరావు, కొనకనమిట్ల ఇంఛార్జి ఎస్సై రెహ్మాన్ సంఘటన స్థలానికి చేరుకుని మంటల్లో ఉన్న షబ్బీర్ను గుర్తించారు. మంటలు ఆర్పేటప్పటికే అతడు మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని పొదిలి వైద్యశాలకు తరలించి, ఆదివారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.