భర్త గురించి వెళ్తుంటే.. బెదిరించి, పొదల్లో గ్యాంగ్ రేప్
విజయవాడ: ఇద్దరు కామాంధులు ఓ మహిళపై దారుణానికి ఒడిగట్టారు. మహిళను బెదిరించి పొదల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె మెడలోని రూ.40 వేల విలువైన బంగారు గొలుసును అపహరించుకుపోయారు.
ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అక్టోబర్ నెల 31న రాత్రి డ్యూటీ నుంచి రైల్వే ఉద్యోగి అయిన భర్త ఇంటికి రాకపోవడంతో ఏం జరిగిందో తెలుసుకోవడానికి తమ నివాస స్థలం రైల్వే క్వార్టర్స్ నుంచి భర్త పని చేసే చోటుకి బయల్దేరింది. ఓ స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మార్గమధ్యంలో ఆమెను అడ్డగించి బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డారు.

అయితే ఆమె నవంబర్ 1న గొలుసు చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత భర్తకు అత్యాచార విషయాన్ని వెల్లడించింది. దీంతో భర్త సాయంతో ఆమె గుడివాడ పోలీసు స్టేషన్లో సంఘటనపై ఫిర్యాదు చేసింది. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు స్టేషన్ ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
దొంగ బంగారం విక్రయ ముఠా గుట్టు రట్టు
కిలో బంగారాన్ని రూ. 18 లక్షలకే అందజేస్తామంటూ మోసగించిన ముఠా గుట్టును గూడెం రూరల్ పోలీసులు రట్టుచేశారు. కొవ్వూరు డీఎస్పీ రాజగోపాల్ మంగళవారం స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. ద్వారకాతిరుమల మండలం గొడుగుపేటకు చెందిన సుంకర ఆంజనేయులు తాడేపల్లిగూడెంకు చెందిన రమేష్, ఆంజనేయులు, గణపవరం మండలం కాశిపాడుకు చెందిన సూర్యనారాయణ పలు నేరాలు చేశారన్నారు.
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా జిల్లా, హైదరాబాద్లతో సహా పలుచోట్ల నకిలీ బంగారం వ్యాపారం చేస్తూ అనేకసార్లు జైలుకు వెళ్లారన్నారు. రూ. లక్ష ఇస్తే మూడు రూపాయల లక్షల విలువైన కరెన్సీని కూడా ఇస్తామంటూ నమ్మించడం, ఆ తర్వాత డబ్బులు తీసుకుని పారిపోతుంటారన్నారు.
ఈ ముఠాకు ఏజెంట్లుగా వరంగల్ జిల్లాకు చెందిన మహ్మద్ యాకోబు, ఆరే నర్శింగం వ్యవహరిస్తున్నారన్నారు. వారిద్దరూ అమాయకులను నమ్మించి సుంకర ఆంజనేయులు వద్దకు పంపిస్తుంటారని ఆయన తెలిపారు. ఈ క్రమంలో కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన చిలకా భాస్కరరావు, అతడి స్నేహితుడు గొట్టిముక్కల సదానందాచారి కిలో బంగారాన్ని రూ. 18 లక్షలకు ఇస్తారన్న ఆశతో సుంకర ఆంజనేయులు వద్దకు వచ్చారు.
భాస్కర రావు, సదానందాచారి అందజేసిన రూ. 3 లక్షలను ముఠా సభ్యులు తమ వెంట తెచ్చిన వంద గ్రాముల బంగారు బిస్కెట్లను రెండింటిని అందజేశారన్నారు. ఆ బిస్కెట్లపై అనుమానం రావడంతో వాటిని ఇచ్చేసి తాము అందజేసిన రూ.3 లక్షలను ఇచ్చేయని కోరారన్నారు. అయితే ముఠా సభ్యులు తాము తెచ్చిన బ్రీఫ్కేసులో నుంచి రూ. వెయ్యినోట్ల పరిమాణంలో ఉన్న తెల్లకాగితాల కట్టలు మూడింటిని ఇచ్చి, వెంటనే ఆ ప్రాంతం నుంచి పారిపోయారన్నారు.
నిందితులు రమేష్, ఆంజనేయులు, సూర్యనారాయణ, యాకోబు, నర్శింగంలను తాడేపల్లిగూడెంలో సోమవారం రాత్రి రూరల్ సీఐ దేవకుమార్ అరెస్టు చేశారన్నారు. వారి నుంచి రూ.లక్ష, 10 గ్రాముల బంగారు బిస్కెట్, మరో రెండు నకిలీ బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. ప్రధాన నిందితుడు ఆంజనేయులు పరారీలో ఉన్నట్టు తెలిపారు.












Click it and Unblock the Notifications