మూడు పెళ్లిళ్ల ఉద్యోగి: ఇంటికెళ్లి నిలదీసింది, దేహశుద్ధి
హైదరాబాద్: మూడోపెళ్లి చేసుకున్న భర్తకు మొదటి భార్య తగిన శాస్తి చేసింది. మహేష్ అనే ఉద్యోగి తొలుత ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. మహేష్ భార్యతో ఉండకుండా వికారాబాదులో తల్లిదండ్రుల వద్ద ఉంటూ నగరానికి వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు.
మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత పద్మకు అసలు విషయం తెలిసింది. రెండో భార్య అతనిని విడిచి వెళ్లిపోవడంతో మూడో పెళ్లి కూడా చేసుకున్నాడు. వారు రాజేంద్ర నగర్లో ఉంటున్నారు. ఈ విషయాలు తెలిసిన మొదటి భార్య, తన బంధువులతో కలిసి వచ్చి అతనికి ఆదివారం దేహశుద్ధి చేసింది. అనంతరం రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో మరో గుండె ఆగింది. పింఛన్ కోసం కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలం కామునిగూడెంలో ఓ వృద్ధుడు శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. 75 ఏళ్ల నర్సయ్య పెన్షన్ కోసం కొంత కాలంగా మండల కార్యాలయం, వీఆర్వోల చుట్టూ తిరిగాడు. అనంతరం శనివారం రాత్రి మండల కేంద్రంలో ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సయ్య మరణానికి నిరసగా ఆదివారం ఆత్మకూరు మండలంలో అఖిలపక్షం రాస్తారోకో నిర్వహించింది.
24 నుంచి ఎర్రచందనం ఈ-వేలం
వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చనున్న ఎర్రచందనం టెండర్ల నిర్వహణను ఆన్లైన్ ద్వారా ఈసారి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే హైకోర్టుతోపాటు వేలం పొడిగింపునకు కేంద్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నుంచి అనుమతి పొందింది.
ఈ అనుమతులతోపాటు, కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా రాష్ట్ర అడ్వకేట్ జనరల్ నుంచి లీగల్ అభిప్రాయం కూడా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో 8వేలకు పైగా మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అటవీశాఖ గోడౌన్లలో పదేళ్లుగా మగ్గుతోంది. వీటిని వేలం వేయాలనుకున్న ప్రతిసారీ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది.
ఈ క్రమంలో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అభిప్రాయం స్వీకరించి అందుకను గుణంగా మెటల్ స్ర్కాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎస్టీసీ) ద్వారా ఈ నెల 24 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఎర్రచందనం దుంగలు ఈ-వేలం వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వం కోరిన మేరకు అడ్వకేట్ జనరల్ కూడా వేలం నిర్వహణకు చట్టపరంగా అభ్యంతరాలు లేవని అభిప్రాయం ఇచ్చారు.
రైలు కిందపడి అన్నాచెల్లెళ్ల మృతి
ప్రమాదవశాత్తూ రైలు కిందపడి అన్నాచెల్లెళ్లు ఇద్దరు మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. వెందోడు రైల్వే స్టేషన్ సమీపంలో కేరళ ఎక్స్ప్రెస్ కింద పడి హరిబాబు, విష్ణుప్రియ అనే అన్నాచెల్లెళ్లు మృతి చెందారు.