వైసీపీకి పవన్ వార్నింగ్- దాడులు చేస్తే భయపడం- ఎదురు తిరుగుతామంటూ...
నివర్ తుపాను బాధితులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన పర్యటన చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కొనసాగుతోంది. ఈ సందర్బంగా తన పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు చేసిన ప్రయత్నాలపై పవన్ మండిపడ్డారు. వైసీపీ దాడులను చూస్తూ ఊరుకోబోనన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కొంటామన్నారు.
చిత్తూరు జిల్లా వైసీపీ జాగీరు కాదని, దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోనని పవన్ వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంపై, పోలీసులపై గౌరవంతో సంయమనం పాటిస్తున్నామని అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంతో పాటు నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పవన్ పర్యటించారు. శ్రీకాళహస్తి బైపాస్ మీదుగా సోయ గ్రామానికి వెళ్లి పవన్ నివర్ తుపాను బాధిత రైతులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు.

రైతులను పరామర్శించేందుకు వచ్చిన తనను వైసీపీ శ్రేణులు అడ్డుకోవడం సరికాదని పవన్ కళ్యాణ్ తెలిపారు. దాడికి ప్రతిదాడి కావాలంటే జనసేన కార్యకర్తలు సిద్ధమని, దమ్ముంటే తన పర్యటన అడ్డుకోవాలని సవాల్ విసిరారు. కొందరు పోలీసుల తీరుపైనా పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కూడా పోలీస్కుటుంబం నుంచే వచ్చానని వారికి గుర్తుచేశారు. కొంతమంది పోలీసులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పవన్ అన్నారు. తీరు మార్చుకోకపోతే వారందరినీ గుర్తు పెట్టుకుంటానని పవన్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications